TSRTC:టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి.. రాజయ్యకూ కీలక పదవి.. అసంతృప్తులకు ఇలా చెక్ పెట్టిన కేసీఆర్

  • IndiaGlitz, [Friday,October 06 2023]

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్యెల్యే టికెట్ రాని అసంతృప్తులను చల్లార్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ విరుగుడు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురిని కార్పొరేషన్ల ఛైర్మన్లగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి తొలి జాబితాలో టికెట్ ప్రకటించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నారు. అందుకే ముత్తిరెడ్డిని సంతృప్తి పర్చేందుకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు.

రైతుబంధు ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్య..

ఇక స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు కాకుండా తన ప్రత్యర్థి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దామోదర్ రాజనరస్సింహతో కూడా ఆయన సమావేశమయ్యారు అయితే ఏమైందో తెలియదు కానీ బీఆర్ఎస్‌లోనే ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి(రైతుబంధు) ఛైర్మన్‌గా రాజయ్యను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌..

వీరితో పాటు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన మేడ్చల్- మల్కాజ్‌గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ను రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ను నియమించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది.