ముంబై టూ హైదరాబాద్.. ‘హారన్’ మోగిస్తే అంతే!

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

భారతదేశంలో అత్యంత రద్దీగల ప్రాంతాల్లో ముంబై మొదటి వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక రాజధానిలో ఎంతమంది వాహనాలు వాడుతున్నారో.. దానివల్ల ఎంతెంత కాలుష్యం అవుతోందో లెక్కలేదు. మరీ ముఖ్యంగా వాహనదారులు విపరీతంగా హారన్‌తో విపరీతంగా శబ్ధ కాలుష్యం జరుగుతోంది. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ‘హారన్’‌కు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ‘పనిషింగ్ సిగ్నల్’ పేరిట శబ్ధ కాలుష్యాన్ని నమోదు చేసే డెసిబిల్ మీటర్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ లైట్ పడినప్పుడు వాహనదారులు హారన్ కొడితే.. అంతే సంగతులు.. ఎందుకంటే.. ఈ సిగ్నల్ ద్వారా ఎవరెవరి వాహనం ఎంత శబ్ధం వస్తుందో..ఆ మీటర్‌లో ఆటోమాటిక్‌గా రికార్డు అయిపోతుంది.

గ్రీన్ సిగ్నల్ పడేంతవరకూ..!

ఒకవేళ పరిమితిని దాటితే మాత్రం రైడ్ లైట్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కానుంది. హారన్ మోగిన ప్రతిసారి రెడ్ లైట్ తిరిగి ప్రారంభం కానుందన్న మాట. అంటే.. గ్రీన్ లైట్ పడేంత వరకు సిగ్నల్ దగ్గరే ఉండిపోవాలన్న మాట. ఇలా చేయడం వల్ల హారన్ మోతను వాహనదారులు దాదాపు తగ్గిస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పలు రాష్ట్రాలు ఇదే ఆలోచనలో న్నాయని తెలుస్తోంది.

త్వరలో హైదరాబాద్‌లో కూడా!

ఇదిలా ఉంటే.. ముంబై తరహా ‘పనిషింగ్ సిగ్నల్’ను భాగ్యనగరంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ముంబైకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కేటీఆర్ ట్యాగ్ చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌, పంజగుట్ట, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఆబిడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా సరే హారన్ మోత మోగిపోతూ ఉంటుంది. హైదరాబాద్‌లో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత హారన్‌ కొట్టారో.. అంతే సంగతులు.