MLC Ramachandraiah: వైసీపీకి వరుస షాకులు.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, దాడి వీరభ్రదరావు కూడా టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాకు చెందిన ద్వారకానాథ రెడ్డి స్వయానా నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి మేనమామ. దీంతో విజయసాయిరెడ్డి, ఆయన భార్య సునందరెడ్డి మినహా కుటుంబ సభ్యులందరూ టీడీపీలోనే ఉన్నారు. గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్ అయిందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అప్పులపాలు చేశారని విమర్శల వర్షం కురిపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. తన లాగే వైసీపీలో ఎంతో మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారందరూ త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు.