ఎమ్మెల్యే రోజా అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!
- IndiaGlitz, [Thursday,June 13 2019]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో నగరి నుంచి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే రోజా తీవ్ర అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమెకు హోం మంత్రి లేదా సినిమాటోగ్రఫీ దక్కుతుందని కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు అందరూ భావించారు. అయితే హోం మంత్రి పాయె.. సినిమాటోగ్రఫీ పాయె.. ఆఖరికి ఏదో ఒక పదవి అయితే దక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవానికి రోజా అనుకున్నదొక్కటి.. అయినొక్కటని చెప్పుకోవచ్చు. రోజా మంత్రి పదవి రేంజ్ ఊహించుకోగా.. జగన్ మాత్రం చైర్పర్సన్ పదవితో మమా అనిపించేశారు.
ఇక అసలు విషయానికొస్తే.. మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న రోజాకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్గా రోజాను నియమించడం జరిగింది. ఇదికూడా కీలకపదవే.. మంత్రి పదవి ఇవ్వలేకపోయిన జగన్.. ఆ రేంజ్కు తగ్గట్లే రోజాకు ఈ పదవి ఇవ్వడం ఇచ్చారు.!. రోజాకు కీలక పదవి దక్కడంతో ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మీ ఇష్టం..!
వాస్తవానికి ఏపీఐఐసీ, ఆర్టీసీ, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లలో ఏదో ఒకటి ఎంచుకునే నిర్ణయాన్ని రోజాకు జగన్ ఇవ్వగా... నిర్ణయాన్ని జగన్కే ఆమె వదిలేసినట్టు సమాచారం. రోజా కచ్చితంగా ఆర్టీసీ ఎంచుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఏపీఐఐసీ అయితే అంతకంటే బెటర్ అని భావించిన రోజా.. ఆఖరికి ఈ పదవి దక్కించుకున్నారు.
విధేయతకు మారుపేరు!
రాజకీయాల్లో ‘విధేయత’, ‘నమ్మకం’ అనే పదాలకు ఎంతో విలువ ఉంటుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ‘ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనేంటో చూపిస్తా..’ అన్న జగన్ను నమ్మి జనాలు ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇక విధేయత విషయానికొస్తే.. కష్టకాలంలో తనకు, తన పార్టీకి అండగా ఉన్నవారిని గుర్తించిన వైఎస్ జగన్ మంత్రి వర్గంలో పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు ఇందుకు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్లే చక్కటి ఉదాహరణ. కాగా.. కొన్నిసార్లు విధేయతకు అర్థాలు మారిపోయినా, అంతిమంగా ఎవరైనా అధినాయకత్వానికి విధేయులుగా ఉండి సాధ్యమైనంత మేర లబ్ది పొందాలనుకోవడం సహజమే. ఈ విషయంలో నగరి ఎమ్మెల్యే రోజా విషయంలో ‘విధేయత’ అంశం అద్భుతంగా పనిచేసింది.
సింగిల్ పోస్ట్ అంతే..!
జగన్ కేబినెట్లో మంత్రిపదవి దక్కకపోయినప్పటికీ రోజా ఎంతో విజ్ఞతతో వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా తన అభిప్రాయాలు వెల్లడించడం కాని.. అసంతృప్తితో పిచ్చిపిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టడం కానీ.. తన మనుషులతో అలాంటి పోస్ట్లు పెట్టించడం కానీ చేయలేదని చెప్పుకోవాలి. ‘జగనన్న నిర్ణయమే నాకు శిరోధార్యం’ అంటూ ఫేస్ బుక్లో సింగిల్ పోస్ట్ పెట్టింది. ఆ విధంగా జగన్ పట్ల తన విధేయత చాటుకుంది. ఇప్పుడా విధేయత ఫలితమే ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి రోజాను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి రోజా స్థానంలో మరెవ్వరున్నా వాళ్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదేమో.
జగనన్నకు ధన్యవాదాలు..
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చి తనకు ప్రాధాన్యత కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా రోజా ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి, పదవిని ఇచ్చిన జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని .. తనకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని రోజా చెప్పారు.