మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

కరోనా సమయంలో తన వంతు భాద్యతగా మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సహాయాలు, విరాళాలు ఇలా ఎన్నో విధాలుగా చిరంజీవి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. కరోనా రోగులు కోలుకోవాలంటే ఆక్సిజన్ ఎంతో కీలకం.ఆక్సిజన్ అందక ఇటీవల చాలామంది పేషంట్లు ప్రాణాలు కోల్పోయారు.

దీనితో చిరంజీవి ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తారు. ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్న చిరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శ అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది.

ఇదిలా ఉండగా చిరంజీవితో సన్నిహితంగా మెలిగే వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ పై ప్రశంసలు కురిపించారు. 'నిన్న మొన్నటి వరకు బ్లడ్ బ్యాంక్స్, ఐ బ్యాంక్స్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్స్ తో కరోనా పేషంట్లకు ఊపిరి అందిస్తున్నారు. మీ సేవలు మాటలలో వర్ణించలేనివి అన్నయ్య' అని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

చిరంజీవి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ, దేవుడు కొండత శక్తిని ఆయనకు ఇవ్వాలని కోరుతున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిరంజీవి ప్రజారాజ్యంలో గంటాశ్రీనివాస రావు అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మెగా కుటుంబంతో ఆయన సన్నిహితంగా ఉంటారు.