తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్‌లో వుండకపోవచ్చు : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Tuesday,September 12 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. అక్టోబర్ 10 లోపు నోటఫికేషన్ వస్తే డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేనిపక్షంలో మార్చి, ఏప్రిల్‌లలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత స్పష్టత వస్తుందని కేటీఆర్ తెలిపారు. మోడీ ఎన్నికలకు భయపడుతున్నారని.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై వుంటుందని అనుకుంటున్నారని అందుకే జమిలీ ఎన్నికల పేరుతో ఆలస్యం చేయాలని భావిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు :

జమిలి ఎన్నికలు వచ్చినా.. ఆరు నెలల పాటు తమ ప్రభుత్వం అపద్ధర్మ ప్రభుత్వంగా వుంటుందని మంత్రి పేర్కొన్నారు. అభ్యర్ధులను ముందుగా ప్రకటించిన తర్వాత మరింత సానుకూలత వ్యక్తమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 90కి స్థానాల్లో విజయం సాధించి మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌, ఇతర కాంగ్రెస్ నేతలకు ప్రజల్లో విశ్వాసం లేదని.. జాతీయ పార్టీలు ఢిల్లీ బానిసలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బానిసలు కావాలో, తెలంగాణ బిడ్డ కావాలో తేల్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ షర్మిల, కేవీపీ రామచంద్రరావు వంటి తెలంగాణ వ్యతిరేకులంతా మరోసారి ఏకమవుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

కేసీఆర్, బీఆర్ఎస్‌లే తెలంగాణకు శ్రీరామరక్ష :

ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ప్రజలకు స్పష్టత వుందని.. కేసీఆర్ మరోసారి రాష్ట్రానికి అవసరమని జనం భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలే తెలంగాణకు శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు. పార్టీ నాయకులపై వున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం కల్పించారని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలకు మళ్లీ రెండో స్థానం తప్పదని కేటీఆర్ జోస్యం చెప్పారు.