Chiranjeevi:ప్రత్యేకహోదా సాధించండి, రోడ్లు వేయండి.. సినిమాలపై మీ ప్రతాపమా : జగన్ టార్గెట్‌గా చిరంజీవి వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Tuesday,August 08 2023]

మెగాస్టార్ చిరంజీవి.. ఏ వేదికపైనైనా లేదా ఇంటర్వ్యూ అయినా చాలా సున్నితంగా మాట్లాడతారు. ఆయన పెద్ద వక్త కాకపోవచ్చు గానీ.. ఎవ్వరిని నొప్పించేలా ఎన్నడూ మాట్లాడలేదు. రాజకీయాల్లోకి వెళ్లినా ప్రత్యర్ధులపై వాడి వేడి విమర్శలు చేయలేదు. అలాంటి మెగాస్టార్ ఎందుకో తన తీరుకు విరుద్ధంగా మాట్లాడారు.. అది కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు.

అలాంటి పనులు మానుకోండి :

ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలని, ప్రత్యేక హోదా, లేదంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి కానీ.. లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, పేదవాళ్ల ఆకలి తీర్చే పథకాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడితే అంతా సంతోషిస్తారని చిరంజీవి పేర్కొన్నారు. కానీ అవన్నీ వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా.. ఇలాంటి పనులు మానుకోవాలని మెగాస్టార్ పేర్కొన్నారు.

200 రోజుల షీల్డ్ అందుకోవడం ఆనందంగా వుంది:

ఇంకా చిరంజీవి ఏమన్నారంటే.. ఆ రోజుల్లో సినిమాలు 100 రోజులు, 200 వందల రోజులు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఆడేవన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయని.. కానీ ఇప్పుడు రెండు వారాల్లోనే సినిమా జర్నీ ముగుస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడటం సాధారణ విషయం కాదని, అప్పటి మాదిరిగా షీల్డ్స్ తీసుకోవడం ఆనందంగా వుందని చిరు అన్నారు. పాత రోజులు రిపీట్ అవుతాయా అనే అనుమానాలు, సందేహలు వుండేవని, కానీ అంతా కష్టపడి ఇది సాధ్యమేనని నిరూపించారని మెగాస్టార్ ప్రశంసించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, చెర్రీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.