చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు.. మెగాస్టార్ ప్రస్థానం ఇదే!

  • IndiaGlitz, [Friday,January 26 2024]

మెగాస్టార్ చిరంజీవి.. నటుడు, రాజకీయ నాయకుడు, సమాజ సేవకుడు, వ్యాపారవేత్త. ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలో తనకంటూ ఓ ముద్ర వేశారు. అందుకే మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. దేశంలోనే భారతరత్న తర్వాత అత్యంత గౌరవంగా భావించే పద్మవిభూషణ్ అవార్డుకు చిరంజీవి పేరును రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రకటించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా రిప్లబిక్‌ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించారు.

అయితే ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల తరపున పద్మవిభూషణ్ అవార్డుకు చిరంజీవి ఎంపిక కావడం గర్వ కారణం. వివిధ రంగాల్లో ప్రతిభ చూపించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసే వారికీ ఈ అత్యుత్తమైన అవార్డును ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఓ సామాన్య నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించి ఏకంగా మెగాస్టార్‌గా చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించే స్థాయికి చిరంజీవి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్‌ స్థాయికి ఎదిగారు. దశాబ్దాల పాటు ఇండస్ట్రీని నెంబర్ వన్ హీరోగా శాసించారు. నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమి కాదు.. కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కఠోర శ్రమ, క్రమశిక్షణ అవసరం. ఇవి రెండూ పాటిస్తూ నేటికీ అగ్రహీరోగా కొనసాగుతూ యువ హీరోలుగా ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిరంజీవి పురస్కారాలు

1955వ సంవత్సరం ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావ్, అంజనాదేవి దంపతులకు తొలి సంతానంగా పశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవి జన్మించారు. అనంతరం సినిమాలపై మక్కువతో మద్రాస్ చేరుకుని స్వయంకృషితో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అగ్రహీరోగా ఎదిగారు. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకుని దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డ్ సృష్టించారు. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అలాగే తన కెరీర్‌లో 3 నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇప్పటివరకు 154 సినిమాల్లో నటించారు. అందులో మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ, రెండు కన్నడ సినిమాలు కూడా ఉన్నారు.

ఇటు సినిమాలు చేస్తూనే తనకు ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టినా ప్రజల కోసం ఏమైనా చేయాలనుకునే ఆలోచనతో 1999లో చిరంజీవి 'ఐ అండ్ బ్లండ్' బ్యాంక్ స్థాపించారు. ఆపదలో ఉన్న వారికి నేత్రదానంతో పాటు రక్తదానం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇప్పటివరకు దాదాపు 10లక్షల మందికి రక్తదానం చేశారు. కరోనా సమయంలోనూ తన ట్రస్ట్ ద్వారా 32 ఆక్సిజన్ బ్యాంకులను ఉచితంగా అందించి చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు సార్లు ఉత్తమ స్వచ్ఛంద రక్త బ్యాంకు అవార్డు గెలుచుకుంది. జూన్ 10, 2006న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హైదరాబాద్‌లోని చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్‌ని ప్రారంభించారు.

ఆయన సేవలను కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2006లోనే ఈ అవార్డు ఆయన అందుకోవడం విశేషం. మళ్లీ 18 ఏళ్ల తర్వాత పద్మవిభూషణ్ అవార్డ్ కూడా అందుకోవడం ఆయన కష్టానికి ఫలితంగా కొనియాడవచ్చు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు ఇప్పటివరకు అతి కొద్ది మందినే ఈ అత్యున్నతమైన అవార్డ్ వరించింది. ఎన్నో రికార్డులు, రివార్డులు, అవార్డులు అందుకున్న ఇలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం 'పద్మవిభూషణ్' అవార్డుతో సత్కరించడం మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.

చిరంజీవి రాజకీయ జీవితం..

సినిమాల్లో మకుటం లేని మారాజుగా కొనసాగుతున్న సమయంలోనే ఉంటే ప్రజలకు మరింత సేవ చేయలేనని భావించిన ఆయన.. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. సామాజిక న్యాయమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని తెలిపారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే మహా మహా నాయకులను ఢీకొని 2009 ఉమ్మడి ఏపీ ఎన్నికలలో అసెంబ్లీలోని 295 సీట్లలో18 స్థానాలను గెలుచుకున్నారు. అలాగే ఆయన తన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుతో పాటు తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయినా తిరుపతి నియోజకవర్గం నుండి రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఫిబ్రవరి 6, 2011న అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. అనంతరం మార్చి 29, 2012న రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 3, 2012న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్టోబర్ 28, 2012న స్వతంత్ర హోదాలో కేంద్ర పర్యాటక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే తన సున్నితమైన మనస్తత్వానికి ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేనని భావించిన చిరు.. మళ్లీ 2017లో ఖైదీ నెంబర్ 150 ద్వారా గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటి నుంచి ఈ వయసులో కూడా తనలోని గ్రేస్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు.

More News

అన్నయ్యకు పద్మవిభూషణ్ రావడం సంతోషంగా ఉంది: పవన్ కల్యాణ్

తెలుగు తేజాలు మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

పద్మవిభూషణ్ అవార్డు ప్రకటనపై చిరంజీవి భావోద్వేగం

దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్‌' తనకు దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అభిమానులకు ధన్యావాదాలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు

చిరంజీవి, వెంకయ్యనాయుడుకి పద్మవిభూషణ్ పురస్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది పద్మ పురస్కారాలను(Padma Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా అందులో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌,

Entrance Exmas: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మార్పు

వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

అవును.. గుంపు మేస్త్రీనే.. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తనను గుంపు మేస్త్రీ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును నేను మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని కౌంటర్ ఇచ్చారు.