అమెరికాకు మహేష్.. 45 రోజులు అక్కడే..

  • IndiaGlitz, [Monday,October 05 2020]

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు... థియేటర్లకు సైతం అనుమతినివ్వడంతో శరవేగంగా షూటింగ్‌లు జరుపుకుంటోంది. ఒకటి అర సినిమాలు తప్ప దాదాపు అన్ని సినిమాలూ షూటింగ్‌ను ప్రారంభించుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా సిద్ధమవుతోంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందమంతా అమెరికా వెళ్లనుంది.

ఈ షెడ్యూల్ 45 రోజల పాటు కొనసాగనుంది. మహేష్‌తో పాటు ప్రధాన తారాగణమంతా అమెరికాకు వెళ్లనుంది. అమెరికాలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుట్రల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పరుశురామ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అమెరికాలో 45 రోజుల షూటింగ్ నిర్వహించిన అనంతరం ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ మళ్లీ జనవరిలో ఇండియాకి తిరిగొస్తారని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ను నిర్మిస్తున్నాయి. అయితే తొలుత ఈ చిత్రానికి పీఎస్‌ వినోద్‌ను ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. ఆయన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం కుదరడం లేదని సమాచారం. దీంతో మరో ఛాయాగ్రాహకుడు మదిని తీసుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.