Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మహేష్ బాబు సొంత జిల్లా గుంటూరులో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అలాగే చిత్ర బృందం అంతా పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం మహేష్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ నింపింది.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో నటన విషయంలో మహేష్‌ను కొట్టేవారు లేరని చెప్పడం ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షలకును మెప్పించగా.. తాజాగా చడీచప్పుడు లేకుండా 'మావా ఎంతైనా' అంటూ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో మహేష్.. కుటుంబం గురించి ఎమోషన్ అవుతున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. అలాగే ఈ పాటలోనూ మహేష్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇప్పటిదాకా పాటల్లో శ్రీలీల మాత్రమే కనిపించగా.. ఈ పాటలో మాత్రం మీనాక్షి చౌదరిని చూపించారు.

మొత్తానికి ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేలా ఉంది. మహేష్ చెప్పినట్లుగా ఈసారి సంక్రాంతి పండుగకు కూడా గట్టిగా కొట్టేలా ఉన్నారు. మరి ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియాలంటే ఈనెల 12వరకు ఆగాల్సిందే.