Let's Metro For CBN: 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో ఉద్రికత్త.. మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబుకు మద్దతుగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు నల్ల టీషర్ట్‌లతో ప్రయాణంకు భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్ మెట్రో స్టేషన్‌ చేరుకుని స్టేషన్‌ మూసివేశారు. నిరసనలకు అనుమతి లేదని నల్ల టీషర్టులు ధరించిన ప్రయాణికులను స్టేషన్ నుంచి బయటకు పంపివేస్తు్న్నారు. దీంతో పోలీసులు, చంద్రబాబు మద్దతుదారులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మెట్రో స్టేషన్లకు భారీగా చేరుకున్న టీడీపీ మద్దతుదారులు..

శ‌నివారం ఉద‌యం 10.30 నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి మెట్రోలో ప్రయాణం చేయాల‌ని టీడీపీ నాయ‌కులు, అభిమానులు పిలుపునిచ్చారు. మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ మధ్యలో ఎక్కడైనా మెట్రో ఎక్కి ఈ నిర‌స‌న‌లో పాల్గొనాలని తెలిపారు. సాధారణ మెట్రో ప్రయాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా నిర‌స‌న తెలపాల‌ని నిర్ణయించారు. దీంతో టీడీపీ మద్దతుదారులు భారీగా మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఆయా మెట్రో స్టేషన్లలో అప్రమత్తమయ్యారు. అయినా కానీ కొంతమంది మెట్రోలో ప్రయాణిస్తూ జై బాబు జైజై బాబు అంటూ నినాదాలు చేశారు.

నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు, మంత్రులు

మరోవైపు ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నుంచి టీడీపీ మద్దతుదారులు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా పొల్గొని తమ మద్దతు తెలిపారు. చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో నిరసనలకు అనుమతి ఇవ్వమని వెల్లడించారు.