MLC:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ : కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లకు ఛాన్స్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

  • IndiaGlitz, [Tuesday,August 01 2023]

గవర్నర్ కోటాలో ఖాళీగా వున్న ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం కల్పించింది తెలంగాణ మంత్రిమండలి. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లకు కేబినెట్ ఆమోదం కల్పించింది. తద్వారా దాదాపు రెండు నెలల కసరత్తు అనంతరం గవర్నర్ కోటాలో ఖాళీగా వున్న నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ జరిగింది. వాస్తవానికి ఈ రెండు స్థానాలకు మే నెలాఖరుకే ముగియగా.. శాసనసభ ఎన్నికలకు ముందు పరిణామం కావడంతో ఆచితూచి వ్యవహరించింది కేబినెట్. సామాజిక వర్గాల వారీగా అధ్యయనం తర్వాతే ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయన, దాసోజు శ్రవణ్‌లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది.

పీఆర్పీ , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో పనిచేసిన శ్రవణ్ :

ఇకపోతే.. నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడేనికి చెందిన దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా వున్న సమయంలో టీఆర్ఎస్‌లో చేరి పొలిట్ బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారు. అయితే అధిష్టానంతో విభేదాల కారణంగా 2014లో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం గతేడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడా ఇమడలేక తిరిగి పుటినిల్లు బీఆర్ఎస్ గూటికే చేరుకున్నారు.

కార్మిక నేతగా కుర్రా సత్యనారాయణకు గుర్తింపు :

కుర్రా సత్యనారాయణ విషయానికి వస్తే.. జనతా పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 1999లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కార్మిక సంఘం నాయకుడిగా పటాన్ చెరు ప్రాంతంలో సత్యనారాయణకు మంచి పేరు వుంది. 2017లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.