'కుందనపు బొమ్మ'ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,August 31 2015]

సుధాకర్‌ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా ఎస్.ఎల్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కుందనపు బొమ్మ'. యం.యం.కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ రోజు (30.8.2015) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కె.విశ్వనాథ్, యస్.యస్.రాజమౌళి, బి.గోపాల్, జగదీష్ తలశిల, ప్రవీణ్ సత్తారు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ని డైరెక్టర్ రాజమౌళి ఆవిష్కరించారు.
ఆడియో సీడీలను సంగీత దర్శకులు కీరవాణి ఆవిష్కరించి, తొలి సీడీని శివశక్తి దత్తా, రాజమౌళికి అందజేసారు.
వేల్ రికార్డ్స్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది.

అనంతరం శ్రీ. కె.విశ్వనాథ్ మాట్లాడుతూ - ''టైటిల్ చాలా బాగుంది. అచ్చు తెలుగు టైటిల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''స్టేజ్ అంతా తెలుగుతనంతో ఉట్టిపడుతోంది. ఈ సినిమాలోని కొన్ని బిట్స్ చూసాను. నాకు బాగా నచ్చాయి. బాపు, రమణల బెస్లింగ్స్ వరాకి ఎప్పుడూ ఉంటాయి. హీరోయిన్ కుందనపు బొమ్మలా ఉంది. కీరవాణి అద్భుతంగా సంగీతమందించారు. పాటలన్నీ బాగున్నాయి. సినిమా డెఫినెట్ గా మంచి విజయం సాధిస్తుంది'' అని చెప్పారు.
డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ - ''రాఘవేంద్రరావుగారి దగ్గర నేను, వరా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసే వాళ్లం. అప్పుడు వరా అంటే పడేది కాదు. ఎందుకంటే రాఘవేంద్రరావుగారు ఎప్పుడూ, ఏదైనా కూడా వరాని చూసి నేర్చుకోమని చెప్పేవారు. వరా గురించి ఇంత గొప్పగా చెబుతున్నారేంటీ అనుకునేవాడిని. అందుకని తనని నేను ఓ విలన్ లా భావించేవాడిని. ఆ తర్వాత తనతో నేను చెన్నయ్ ట్రావెల్ చేసాను. అప్పుడు తను చాలా మంచి వ్యక్తి అని, క్లీన్ హార్టెటెడ్ అని తెలుసుకున్నాను. వరాకి ఎప్పుడో మంచి సక్సెస్ రావాల్సింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటాడని భావిస్తున్నాను'' అన్నారు.

సంగీత దర్శకులు కీరవాణి మాట్లాడుతూ - ''బాపుగారి సినిమాలకు చేస్తున్నప్పట్నుంచి వరా నాకు తెలుసు. తను చాలా టాలెంటెడ్. ఈ సినిమాకి పాటలు బాగా రావడానికి కారణం ఈ టీమ్ చూపించిన ప్రేమ. వారి ప్రేమ నన్ను మంచి పాటలు చేసేలా చేసింది. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్'' అని చెప్పారు.

డైరెక్టర్ వరా మాట్లాడుతూ - ''కీరవాణిగారి ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. నేను కీరవాణిగారికి పెద్ద అభిమానిని. ఈ సినిమా కోసం ఓ ట్రెడిషనల్ సాంగ్ కావాలని అడిగాను. ఓ ట్యూన్ చేసారు. దానికంటే బెటర్ మెంట్ కావాలని అడిగితే, ఇప్పటి ట్రెండ్ కి సరిపడా చేస్తానని మరో ట్యూన్ చేసారు. అంతా ప్రొఫెషనల్ గా ఉంటారు ఆయన. నా అదృష్టం ఏంటంటే ఈ సినిమాలోని ఓ పాటను శివశక్తి దత్తాగారు రాసారు. నిర్మాతలకు చాలా కృతజ్ఞతలు. యేడాది నుంచి ఈ సినిమా కోసం వారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. వారిని ఈ సినిమా డిస్పాయింట్ చేయదు. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. కెమరామ్యాన్, రైటర్స్ అందరూ చాలా బాగా సహకరించారు. హీరో, హీరోయిన్లు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లు. ముగ్గురూ అద్భుతంగా నటించారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం'' అని చెప్పారు.

హీరో సుధాకర్ మాట్లాడుతూ - ''బాపు, రమణగారి బ్లెస్సింగ్స్ మాకుంటాయి. ఇద్దరు హీరోలు అనగానే డీలాపడిపోయాను. కథ విన్న తర్వాత అద్భుతం అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా వదులుకోకూడదని భావించాను. డైరెక్టర్ చాలా కూల్ పర్సన్. ప్రతి విషయంలోనూ చాలా క్లారటీగా ఉంటారు. ఈ సినిమాలో నాకు పాటలు లేవు. కానీ కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది'' అన్నారు.

మరో హీరో సుధీర్ వర్మ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో ఓ హీరోగా నటించాను. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. 40రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. చాలా మంచి టీమ్. రాఘవేంద్రరావుగారి సమక్షంలో ఆడిషన్స్ జరిగాయి. నా మీద ఎంతో నమ్మకంతో ఈ సినిమా కోసం ఎంపికచేసుకున్నారు. వారిని నిరాశపరచలేదు. మా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

ఇంకా ఈ వేడుకలో డైరెక్టర్ బి.గోపాల్, హీరోయిన్ చాందిని, సిద్ధు, ప్రవీణ్ సత్తారు తదితరులు సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

నటీనటులు:

సుధాకర్‌ కోమాకుల, సుధీర్‌వర్మ, చాందినీ చౌదరి, రాజీవ్‌ కనకాల, నాగినీడు, చంద్రశేఖర్‌, షకలక శంకర్‌, ఝాన్సీ, మధుమణి, గాయత్రి భార్గవి, ఆలపాటి లక్ష్మీ, అజయ్‌ ఘోష్‌, షాని, సిరి, పల్లవి, మాస్టర్‌ సాత్విక్‌, బేబీ జాహ్నవి తదితరులు