'ఆర్‌ఆర్‌ఆర్‌'పై కీరవాణి అప్‌డేట్‌..!

రెండు వందలకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సీనియర్‌ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' సినిమాకు సంగీతం అందించిన కీరవాణి ఇప్పుడు మరోసారి రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌)' సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా..కోవిడ్‌ ప్రభావానికి గురైన కొన్నాళ్లుగా కీరవాణి తన వర్క్‌ అంతటినీ పెండింగ్‌లో పెట్టాడు. అయితే తాను త్వరలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' వర్క్‌ను ప్రారంభిస్తానని తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు కీరవాణి. అంతేకాదు.. తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి కూడా తెలియజేశారు. ప్రస్తుతం జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో, నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రంతో పాటు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తోన్న చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నట్లు కీరవాణి తెలిపారు.

కోవిడ్‌ ప్రభావానికి కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులు గురై బయటపడ్డారు. వీరిలో కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ మాత్రమే కరోనా వారియర్స్‌గా మారి ప్లాస్మాను దానం చేశారు. రీసెంట్‌గా మరోసారి తమ శరీరంలో యాంటీబాడీస్‌ యాక్టివ్‌గా ఉండటంతో కీరవాణి, కాలభైరవ సోమవారం రోజున రెండోసారి ప్లాస్మాను దానం చేశారు. కరోనా వారియర్స్‌ అందరూ మరోసారి చెక్‌ చేసుకుని యాంటీబాడీస్‌ యాక్టివ్‌గా ఉంటే.. ప్లాస్మాను దానం చేయాలని కోరారు.