KCR:పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ సభ రద్దు.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Friday,November 24 2023]

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ప్రచారానికి కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వరుస సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తు్న్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కూడా రేపు(శనివారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండటంతో సభను రద్దు చేశారు. ఈ మేరకు సభను రద్దు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది .

మరోవైపు కేసీఆర్‌ రోజుకు మూడు, నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అలాగే కాంగ్రెస్‌కు అధికారం వస్తే జరగబోయే పరిస్థితులను ప్రజలకు వివరిస్తు్న్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసలు.. ఇదీ కాంగ్రెస్‌ రాజ్యంలో మన బతుకు అంటూ గుర్తుచేస్తున్నారు. హస్తం పార్టీ వల్లే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అయిందని చెబుతున్నారు.

ఇక కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్‌ రావు, కవిత కూడా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాలని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు, రైతుల ఆత్మహత్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.