KCR:ట్విట్టర్‌(ఎక్స్)లోకి కేసీఆర్ ఎంట్రీ.. తొలి ట్వీట్ ఏంటంటే..?

  • IndiaGlitz, [Saturday,April 27 2024]

ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపుతుందో అందరికి తెలిసిందే. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మనకు కనపడేలా చేస్తుంది. ఇక రాజకీయాల్లో అయితే సోషల్ మీడియా చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. నేతల గెలుపోటములను.. పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయడంతో కీలక పాత్ర పోషించడంలో ముందుంది. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ల వరకు అందరూ సోషల్ మీడియానే తమ ఆయుధంగా మార్చుకున్నారు.

ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తమ రోజూవారీ కార్యక్రమాలు, పాల్గొన్న సమావేశాలు, ప్రత్యర్థులపై విమర్శలు ఇలా ప్రతీది ప్రజలతో పంచుకుంటారు. అలాగే ప్రతి పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. తాజాగా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఆయన ట్విట్టర్ ఎక్స్‌లో ఖాతా తెరిచారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఆయన మాత్రం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ, తనయుడు కేటీఆర్, మనవడు హిమాన్షు, మాజీ మంత్రి హరీష్‌రావు అకౌంటర్లను మాత్రమే ఫాలో అవుతున్నారు.

అలాగే తన తొలి ట్వీట్‌గా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! తెలిపారు. రెండో ట్వీట్‌గా ఎన్నికల ప్రచారంలో భాగంగా 'బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దాం! జై తెలంగాణ' అని పేర్కొన్నారు. మొత్తానికి ఇక నుంచి తన రోజు వారీ కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థులపై విమర్శలను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకోనున్నారు. కాగా దేశంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న రాజకీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి స్థానంలో ఉన్నారు.