Kavitha:లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

  • IndiaGlitz, [Tuesday,April 23 2024]

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. మంగళవారంతో సీబీఐ, ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్ర కీలకమని.. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మరో 14 రోజుల పాటు కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పు వెలువరించారు. అటు ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం మే 7వ తేదీ వరకూ కస్టడీ పొడిగించారు. దీంతో అప్పటివరకూ వీరిద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు.

కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని కొత్తగా ఏమీ చెప్పడం లేదని ఆమె తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తునకు సంబంధించి వివరాలను ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జ్‌షీట్ సమర్పిస్తామని వివరించింది.

కాగా మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత 10 రోజులు ఈడీ కస్టడీలో ఉండగా.. మార్చి 26న కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించండతో తిహార్ జైలులో ఉంటున్నారు. ఇదే కేసులో ఈనెల 11న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మే 2న తుది తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. మొత్తానికి ఈ కేసులో కవితకు ఎప్పుడు ఊరట లభించి జైలు నుంచి విడుదల అవుతారో కాలమే నిర్ణయించాలి.