జెట్ ఎయిర్‌వేస్ కీలక నిర్ణయం.. అర్ధరాత్రి నుంచి బంద్

  • IndiaGlitz, [Wednesday,April 17 2019]

అప్పుల్లో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు కార్యకాలాపాలు ఆగకుండా కాపాడుకున్న సంస్థకు కావాల్సిన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా బుధవారం నాడు రాత్రి 10:30 గంటలకు నడిచే విమానమే చివరిదని సదరు కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు 123 విమానాలతో ఆకాశవీధిలో సేవలందించిన సంస్థ నేడు ఎగిరేందుకు ఎంతో కష్టపడాల్సిన స్థితికి చేరడం గమనార్హం.

కాగా.. 2018లో ఒకరకంగా ఎయిర్‌వేస్ నడిచినప్పటికీ ఈ ఏడాది ప్రారంభం అనగా జనవరి నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కనీసం విమానాల్ని నడిపేందుకు కూడా డబ్బులేక నానా తిప్పలు పడుతోంది. చివరకు సర్వీసులు రద్దు చేసుకునేంత దుస్థికి దిగజారిపోయింది. అప్పట్లోనే 20 విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బుధవారానికి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పెగాసస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, జూమ్ ఎయిర్ లాంటి సర్వీసులన్నీ మూతపడ్డాయి. తాజాగా ఆ కోవలోకే జెట్ ఎయిర్ వేస్ చేరింది. గడిచిన ఐదేళ్లలో ఇలా ఏడు విమాన సంస్థలు మూతపడటం గమనార్హం.

జెట్ ఎయిర్‌వేస్ రియాక్షన్..

రుణదాతల నుంచి ఎటువంటి అత్యవసర నిధులు అందకపోవడం.. వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేకపోవడంతో.. సంస్థ ఇప్పుడు సొంతంగా విమాన ఇంధనాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో లేదు. అలాగే ఇతర ఖర్చులను కూడా భరించే స్థితిలో లేదు. దీంతో అన్ని అంతర్జాతీయ, జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించాం అని జెట్ ఎయిర్ వేస్ స్పష్టం చేసింది.