JD Lakshminarayana: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలి.. జేడీ డిమాండ్

  • IndiaGlitz, [Saturday,May 25 2024]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణ రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం ఈ ఏడాది జూన్ రెండో తేదీతో ముగుస్తుంది. అయితే హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయ నాయకుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ డిమాండ్ చేయగా.. తాజాగా సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ కూడా ఇదే డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున.. మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని జేడీ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి వెళ్లిపోయి ఏపీలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఇప్పటికీ ఏపీ రాజధాని అమరావతిగానే ఉంది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది. చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులను కూడా వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని పొడిగించాలన్న డిమాండ్ వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్ వినిపించగా.. తర్వాత సైలెంట్ అయిపోయారు. తాజాగా జేడీ లక్ష్మినారాయణ ఈ డిమాండ్ అందుకున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాజధాని అనే పేరు కానీ ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు మాత్రం హైదరాబాద్ నుంచి జరగడం లేదు. హైదరాబాద్‌ నుంచి పరిపాలన చేసుకునే వెసులుబాటు ఉన్నా కానీ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఆ అవకాశం వాడుకోలేదు. అలాంటిది ఇప్పుడు మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పొడిగించినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.