జేసీ బ్రదర్స్ ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయారేం!?

సర్పంచ్‌గా పోటీ చేసిన వ్యక్తి రేపొద్దున ఏ ఎంపీటీసీనో.. జడ్పీటీసీనో.. లేకుంటే అంతకుమించి ఏదైనా కోరుకుంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తయితే మళ్లీ.. మళ్లీ పోటీ చేస్తారు లేకుంటే ఎమ్మెల్యే అయిన వ్యక్తి సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి కావాలని కోరుకుంటారు. ఒకవేళ వీలు కాకపోతే కనీసం మునుపు అనుభవించిన పదవినైనా కోరుకుంటారు.. అయితే అదే ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగిన వారు.. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది..? అసలు అలా ఎవరు పోటీ చేశారు..? ఇంతకీ ఆ పరిస్థితికి దిగజారిపోయిన ఆ నేత ఎవరనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఎందుకిలా..!?

అలా పోటీ చేసింది మరెవరో కాదండోయ్ పోటీ చేసింది.. రాయలసీమలో మరీ ముఖ్యంగా అనంత జిల్లాలో ఓ వెలుగు వెలిగిన జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజమండోయ్. తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగారు. తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్‌గా నామినేషన్ వేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరపున ఆయన లాయర్లు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇలా నామినేషన్ వేసి తన ఎమ్మెల్యే స్థాయిని కార్పొరేటర్ స్థాయికి ఆయనకు ఆయనగా దిగజార్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. కాగా.. ఆయన కార్పొరేటర్‌గా నామినేషన్ వేయడంతో నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు కంగుతిన్నారు. వామ్మో ఈయనేంట్రా బాబూ ఇలా చేశారంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

వరుస షాక్‌లతో..!

ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో.. టీడీపీ హయాంలో జేసీ ఫ్యామిలీ హవా గట్టిగానే నడిచింది. జేసీ బ్రదర్స్ ఎంతంటే.. అంతే.. అలాంటిది ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయ్. అదెలాగంటే.. బ్రదర్స్ ఇద్దరూ దాదాపు రాజకీయాలకు స్వస్తి చెప్పి.. వారసులను గత ఎన్నికల్లో పోటీ చేయించారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా.. మరొకరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఇద్దరూ ఘోర ఓటమిని చవిచూశారు. మరోవైపు జేసీ ఫ్యామిలీకి ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్లంతా ఒక్కొక్కరు వారికి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చేసుకుంటున్నారు.

ఎమ్మెల్యే కొడుకుపై కీలకనేత పోటీ..

కాగా.. ప్రభాకర్‌రెడ్డి పోటీచేస్తున్న వార్డు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ పోటీలో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్‌కు పడిపోయిన జేసీ బ్రదర్ పరిస్థితి ఎలా ఉంటుంది..? గెలిచి పరువు నిలుపుకుంటారా..? లేకుంటే ఉన్న పరువు పోగొట్టుకుంటారా..? అయితే వైసీపీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఇక్కడ ఫుల్ మజా ఉంటుంది..? మరి గెలుపెవరిదో.. ఎవర్ని గెలుపు వరిస్తుందో తెలియాంటే ఎన్నికలైపోయి.. ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.