జనసేనకు జనం బ్రహ్మరథం.. గంటా 'గంట' అంతే!!
- IndiaGlitz, [Thursday,April 04 2019]
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు.. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డబ్బుతో ప్రజాదరణను కొనుక్కోవాలనుకొంటున్నారు కానీ మార్పు కోసం వచ్చిన జనసేన పార్టీకే జనం బ్రహ్మరథం పడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు కైవశం చేసుకుంటే.. ఎవరో పెట్టిన పార్టీని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని విమర్శలు గుప్పించారు. కానీ జనసేన పార్టీ మాత్రమే జనం కోసం ఆవిర్భవించిందని పవన్ చెప్పుకొచ్చారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించిన పవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు అన్నంపెట్టిన నేల.
ఈ నేలపై కబ్జాలు, రౌడీయిజం, గుండాయిజం పెరిగిపోవడం బాధ కలిగించింది. విశాఖపట్నం రాజధాని అయితే బాగుండేది. కానీ జరగలేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాజధానికి సమానంగా విశాఖను అభివృద్ధి చేస్తాం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు మద్దతు ఇచ్చాను. అప్పటి ప్రధాని అభ్యర్ధి అయిన మోడీని బలమైన నాయకుడు అని చెప్పాను. తర్వాత తెలిసింది ఆయన బలమైన నాయకుడు కాదు అందరిలాంటి రాజకీయ నాయకుడేనని. ఆయన దేశానికి పనికొచ్చే నాయకుడులా అనిపించలేదు. ఆయన్ను మనం ఇష్టపడి ఎన్నుకుంటే.. ఆయన భయపెట్టి పాలిస్తున్నారు. ఈ నేల ప్రేమించే వారికి అండగా ఉంటుంది కానీ, భయపెట్టేవారిని ఎదిరిస్తుంది. అయినా భయపెట్టి ఎంతకాలం పాలిస్తారు. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రెండు తినడానికి పనికిరాని ఊక లడ్డూలు ఇచ్చారు అని పవన్ చెప్పుకొచ్చారు.
కబ్జాకోరులకు మంత్రి గంటా అండ
తెలుగుదేశం నాయకులంటే ఎందుకు విసుగంటే.. జగన్ ముఖ్యమంత్రి అయితే బాంబుల కల్చర్ వస్తుంది, కబ్జాలు పెరిగిపోతాయని చెప్పి, వీళ్లు కూడా అదే పనిచేశారు. విశాఖలో అడ్డగోలుగా భూములు దోచేశారు. నడకలేని వారిని నిలబెట్టే ఒక పోలియో డాక్టర్ భూములను కూడా ఆక్రమించారు. మంత్రి గంటా దగ్గరకు వెళ్తే కబ్జాకోరులకు అనుకూలంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వస్తే కబ్జాలు పెరిగిపోతాయని చెప్పిన మీరే జగన్లా తయారైతే ప్రజలను కాపాడేదెవరూ..?. ప్రజలను కాపాడేందుకు జనసేన పార్టీ, జనసైనికులు ఉన్నారు. గంటా ‘గంట’ మోగకుండా చేయాలంటే ఆయనకు పోటీగా నిలబడ్డ ఉషా కిరణ్ని అఖండ మెజార్టీతో గెలిపించాలి. ప్రతిసారి నియోజకవర్గం మార్చే నాయకులు ప్రజలకు ఏం చేస్తారు... డాక్టర్ల భూములు కబ్జా చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్ప అని పవన్ కల్యాణ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.