Ex Minister Narayana:మాజీ మంత్రి నారాయణ మరదలి ఆరోపణలు : వీర మహిళకు పెద్ద కష్టం .. ఇలా వదిలేస్తారా పవన్ గారు

  • IndiaGlitz, [Monday,July 31 2023]

ఇస్త్రీ నలగని వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ.. తియ్యటి మాటలు చెబుతూ.. పెద్ద మనిషిలా కనిపించే ఎంతోమంది నిజస్వరూపం వేరే వుంటుంది. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ వ్యవహారం కూడా అలాంటిదే. సొంత మరదలే నేరుగా ఆయనపై ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన బావగారు నారాయణ తనను లైంగికంగా వేధించారని ఆయన మరదలు ప్రియా పొంగూరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్ స్పందించకపోవడం శోచనీయం.

చిన్న ట్వీట్ వేసేందుకు తీరిక లేదా :

మహిళల అక్రమ రవాణా, మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ల హస్తం వుందని.. వారు సేకరించే డేటా దొడ్దిదారిన సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు పవన్ కల్యాణ్. మరి ఆడబిడ్డలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్న ఆయన.. ఓ మహిళకు కష్టం వస్తే మౌనం ఎందుకు దాల్చారు. ఎందుకంటే ఆవిడ ఆరోపణలు చేసింది తనకు అత్యంత అప్తుడైన చంద్రబాబుకు అప్తుడు మీద. వేదికలపైకి ఎక్కి మైక్ పట్టుకుని ఊగిపోతూ మాట్లాడనక్కర్లేదు. కనీసం చిన్న ట్వీట్ చేసినా చాలు. ఆ ప్రభావం ఖచ్చితంగా వుంటుంది. కానీ అలాంటివి చేస్తే చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పవన్‌కు తెలుసు. అందుకే తనకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, మిగిలిన అంశాల్లో ఏమోసార్ నాకు కనపడదు అనే సూత్రాన్ని జనసేనాని అవలంభిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

టీడీపీలో కీచకులు :

నిజానికి తెలుగుదేశం నేతలు మహిళలను వేధించడం వారిని చిత్రహింసలకు గురిచేయడం ఇదేం కొత్త కాదు. పార్టీలోని వారిని, సొంత కుటుంబీకులను లైంగికంగా వేధించిన ఘటనలు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారానికి సూత్రధారులు టీడీపీ నేతలే. రూ.10 వేలు అప్పుగా ఇచ్చి రూ. లక్ష వసూలు చేయడమే కాకుండా, తల్లీబిడ్డను, ఒకే ఇంట్లో అక్కాచెల్లెళ్లను లైంగికంగా హింసించిన ఘటనలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో బెజవాడ నడిబొడ్డున వెలుగుచూశాయి. ఇక మాజీ దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన కుమారుడు శివరామకృష్ణతో కలిసి కోడలు పద్మప్రియను వేధించిన కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, అయన భార్య, కొడుకు నాగరాజు కలిసి కోడలు కీర్తిని వేధించిన కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. అంతేకాదు సినీతారలు కవిత, దివ్య వాణి సైతం పార్టీలో తమకు జరిగిన అవమానాలు, ఇబ్బందులను మీడియా సాక్షిగా బయటపెట్టి కంటతడి పెడుతూ తెలుగుదేశాన్ని వీడిన ఘటనలు ఇంకా జనం కళ్లెదుట మెదులుతూనే వున్నాయి.

అప్పుడు బాలయ్య.. ఇప్పుడు ప్రియ :

తమకు అత్యంత అప్తులైన నేతలు చిక్కుల్లో పడితే.. టీటీపీ పెద్దలు రంగంలోకి దిగిపోతారు. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి వారిని రక్షిస్తారు. అప్పట్లో తన ఇంటిలో ఇద్దరిని కాల్చి చంపిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కేసు నుచి తప్పించేందుకు మెంటల్ సర్టిఫికెట్ ఇప్పించారు. ప్రస్తుతం నారాయణను బయటపడేసేందుకు గాను ప్రియా పొంగూరుకు పిచ్చిది అనే ముద్ర వేశారు. ప్రియ మెంటల్ కండీషన్ బాలేదని, ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని స్వయంగా ఆమె భర్త , నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పారు. అంటే ఆ మాటలను పట్టించుకోవద్దనేది ఆయన ప్రకటన సారాంశం. కట్టుకున్న మొగుడే అంత మాట అన్నాక.. మరొకరు నోరెత్తడానికి అవకాశం వుంటుందా.. అదే వాళ్ల ప్లాన్ మరి

పవన్‌కు అండగా నిలిచిన ప్రియా పొంగూరు:

ఈ వివాదం మొత్తంలో ఒక ట్విస్ట్ చూస్తే.. ఈ ప్రియా పొంగూరు జనసేన‌కు హార్ట్‌కోర్ ఫ్యాన్ అట. వాలంటీర్ల మీద పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి తీవ్ర నిరసన ఎదురైనప్పుడు ప్రియా ఆయనకు అండగా నిలిచారు. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. మరి తన కోసం అండగా నిలిచిన వీర మహిళకు.. పవన్ ఒక పార్టీ అధినేతగా కాకపోయినా సగటు మనిషిగా మద్ధతు పలకాలిగా. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న ఆమె పక్షాన నిలబడాలిగా. వీర మహిళను ఇబ్బందుల్లో వున్నప్పుడు వదిలేశారని రేపు వైసీపీ నేతలు ప్రశ్నిస్తే.. ఏమని సమాధానం చెబుతారు. రాష్ట్రంలో తన కోసం కష్టపడుతున్న లక్షలాది మంది వీరమహిళలకు భరోసా ఏం కల్పిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.