మీ ఫెయిల్యూర్స్ జనసేనపై రుద్దుతారా .. వివాదాలకు ‘అంబేద్కర్’ను వాడొద్దు : అమలాపురం అల్లర్లపై పవన్ స్పందన

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు వద్దంటూ జేఏసీ మంగళవారం నిర్వహించిన ఆందోళన అమలాపురంలో హింసాత్మక పరిస్ధితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని... శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పవన్ కల్యాణ్ కోరారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ ధ్వజమెత్తారు. వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని.. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునంటూ పవన్ వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోంమంత్రి ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు.