Pawan Kalyan:ఆడబిడ్డలపై అఘాయిత్యాలు .. జగన్ , హోంమంత్రికి స్పందించే బాధ్యత లేదా : పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Wednesday,September 27 2023]

చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్ధిని దారుణంగా హతమార్చిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యం గురించి తాను మాట్లాడగానే హాహాకారాలు చేసిన అధికారపక్షం, మహిళా కమీషన్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా అని ఆయన నిలదీశారు. ఇంటర్ విద్యార్ధి హత్యపై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గానీ, మహిళా కమీషన్ బాధ్యురాలు గానీ ఎందుకు స్పందించడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు .. ఈ ఘటన తీవ్రీతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని జనసేనాని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు, మహిళలకు రక్షణ కరువు :

అటు విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ అన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల స్థాయి ఏ స్థాయిలో వున్నాయో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, మహిళలకు రక్షణ కరువైందనే మాట వాస్తవమని పవన్ ఎద్దేవా చేశారు. మహిళలను వేధించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించకుండా అధికార పక్షం వారి చేతుల్ని కట్టేస్తోందన్నారు. దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదని జనసేనాని చురకలంటించారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు.

కళ్లు పీకి, జుట్టు కత్తిరించి యువతి దారుణ హత్య :

కాగా.. చిత్తూరు జిల్లా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 20వ తేదీన ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై తేలింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిందా..? లేక ఎక్కడో చంపేసి ఇక్కడికి తెచ్చి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే భవ్యశ్రీ మృతదేహానికి శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించిన స్థితిలో వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.