Jana Sena:ముసుగు తొలగింది.. ‘‘పొత్తు’’ పొడిచింది, బలి కావడానికి జనసైనికులు సిద్ధమా..?

  • IndiaGlitz, [Friday,September 15 2023]

ముసుగు తొలగిపోయింది.. ఎప్పుడెప్పుడు విషయం చెబుదామా అని ఎదురుచూసిన వారికి మంచి ముహూర్తం రానే వచ్చింది. అదే టీడీపీ-జనసేన పొత్తు. వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన అనంతరం పవన్ ఈ ప్రకటన చేశారు.

షాకవ్వాల్సిందే బీజేపీయే :

నిజానికి ఇందులో కొత్తేమి లేదు.. టీడీపీ-జనసేన కలిసి నడుస్తాయని, త్వరలోనే ముసుగు వీడిపోతుందని వైసీపీ ఎప్పటి నుంచో చెబుతోంది. అందుకే అధికార పార్టీ ఏమాత్రం విస్మయానికి గురికాలేదు. ఆశ్చర్యపడాల్సింది బీజేపీ మాత్రమే. వాస్తవానికి పవన్ ఎన్నడూ చంద్రబాబును వీడలేదు. బీజేపీతో పొత్తులో వున్నట్లు నటించిన ఆయన.. టీడీపీ ప్రయోజనాల కోసం శ్రమించారు. చంద్రబాబును కేంద్ర పెద్దలతో కలిపేందుకు ఆయన రాజీలేని పోరాటం చేశారు. కానీ బాబు గారి తత్త్వం తెలియడంతో మోడీ, అమిత్ షాలు ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు. కానీ చంద్రబాబు ప్రయత్నాలు చంద్రబాబువి.

ఇప్పుడే ఎందుకు పొత్తు ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా వుంది. పొత్తులపై జనసేన, టీడీపీ క్లారిటీతోనే వున్నాయి. కానీ బీజేపీని కూడా కలుపుకుని వెళితే ఇక తమకు తిరుగులేదని చంద్రబాబు వ్యూహం. ఎన్నికల నాటికీ కమలనాథులను ఒప్పించి మంచి ముహూర్తం చూసుకుని పొత్తుల ప్రకటన చేయాలనుకున్నారు. అయితే జగన్‌ ఈ బ్యాచ్‌కి షాకిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో అరెస్ట్ చేయించారు. నాటి నుంచి టీడీపీ కేడర్‌ చెల్లాచెదురైంది. నాయకుడు లేకపోవడంతో ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో అర్ధం కాక పచ్చ శ్రేణులు కకావికలం అయ్యాయి. చంద్రబాబు వచ్చే వరకు పార్టీని, కేడర్‌ను యాక్టీవ్‌గా వుంచడం అచ్చెన్నాయుడు, బాలయ్య, లోకేష్‌ల వల్ల కాదని ఇప్పటికే తేలిపోయింది. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కూడా డైవర్ట్ కావాలి. మరి ఏం చేయాలి .. అప్పుడే వారికి పవన్ కనిపించారు.

జనసేనకు ఇచ్చే సీట్లెన్ని :

రాజమండ్రి సెంట్రల్ జైలుకొచ్చి చంద్రబాబును ఓదార్చారు. ఆ వెంటనే పొత్తుల ప్రకటన చేశారు. పవన్ టీడీపీతో అధికారికంగా కలిశారు కాబట్టి.. జనసైనికులు, కాపు యువత ఇప్పటి నుంచి చంద్రబాబు , తెలుగుదేశం కోసం రోడ్డెక్కాల్సి వుంటుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే. ఆలోచన లేని కేవలం ఆవేశమే ఉన్న యువత కోసం సరైన స్కెచ్ గీశారు. పవన్ పిలుపుతో వెర్రెత్తిపోయి ఏం చేయమంటే అది చేసే యువత బలి కానున్నారు. జనసైనికులంతా రేపటి నుంచి ప్రభుత్వంతో పోరాడాలి.. రెండు భుజాలమీద రెండు పార్టీల జెండాలు పట్టుకుని యుద్ధం చేయాలి. కేసులకు ఎదురెళ్లాలి.. ఆందోళనలు చేయాలి.. అవసరం ఐతే పోలీసుల చేతుల్లో దెబ్బలు తినాలి. అంటే ఇప్పుడు జనసైనికులు సైతం టిడిపికి కూలీలుగా పని చేయాలి. ఇంతా కష్టపడితే అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు ? మొదటి నుంచి మన కాపులు.. మన అస్తిత్వం అని ఆశతో ఉంటూ వస్తున్న కాపు నాయకులూ, యువతకు సీట్లు దక్కుతాయా ? అదంతా ఎవరికీ అర్థం కానీ బ్రహ్మ పదార్థం.