Jagapathi Babu:వాళ్ల కష్టాల్ని, నా కష్టాలుగా భావించా.. నా అభిమానులే ఇలా చేస్తారనుకోలేదు : జగపతిబాబు సంచలన ప్రకటన

  • IndiaGlitz, [Sunday,October 08 2023]

తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జగపతి బాబు. 1989లో సింహ స్వప్నం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దాదాపు 3 దశాబ్ధాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వుంటారు. 90వ దశకంలో కుటుంబ కథా చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, ఫాదర్‌గా, ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో బిజీగా గడుపుతున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో జగపతి బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్లకు , ట్రస్ట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొందరు అభిమానుల ప్రేమ కంటే తన నుంచి ఆశించేది ఎక్కువ అయ్యిందని, తానే ఇబ్బందిపడే పరిస్ధితి వచ్చిందని .. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని జగపతి బాబు తెలిపారు.

‘అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్యకారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాలుగుని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళ్లు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చే వాళ్లని మనస్ఫూర్తిగా నమ్మాను. కానీ బాధాకరం అయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి నాకు, నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కు ఎటువంటి సంబంధం లేదు. దీన్ని విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను... జీవించండి. జీవించనివ్వండి.’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామబాణం, రుద్రాంగి, సలార్, గుంటూరు కారం, పుష్ప 2 లలో జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాలే కావడంతో వాటిలో జగపతి బాబు ఏ పాత్ర పోషించారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.