Jagananna Arogya Suraksha: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా దూసుకెళ్తోన్న 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆరోగ్య శ్రీ, ఇంటింటికే ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దూసుకెళ్తోంది. ఆరోగ్య సురక్ష క్యాంపులు చేపట్టి ప్రతి ఇంటికీ ఆరోగ్యం అన్న నినాదంతో సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారు.

ఒక్కో కుటుంబానికి రూ.12వేల వరకు ఆదా..

రాష్ట్రంలో వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ కనీసం వైద్యపరీక్షలు చేయించుకునే స్తోమత లేక ఇబ్బందిపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సురక్ష పథకం ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలను పీడిస్తున్న వైరల్ జ్వరాలైన డెంగ్యు, టైఫాయిడ్ వంటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీని వల్ల ఒక్కో కుటుంబానికి రూ.12వేల వరకు ఆదా అవుతోంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుంటుబాలపై వేల కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ ఆరోగ్య సురక్ష క్యాంపుల ప్రత్యేకతలు మరిన్ని ఉన్నాయి.

సూపర్‌ స్పెషాలిటీ తరహాలో రక్త పరీక్షలు, మందులు..

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఏవిధంగా స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారో అదే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగులకు వైద్యం అందుతోంది. దాని కంటే ముందు.. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌, వివిధ రకాల రక్తపరీక్షలు, యూరినరీ పరీక్షలు అన్ని కలిపి దాదాపు 7 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇవే బయట ఆసుపత్రుల్లో చేయించాలంటే దాదాపు రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. పైగా బస్సు, ఆటో ఛార్జీలు అదనం. ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఓపీ తీసుకుని వేచిచూడాలి. ఇదే సురక్ష క్యాంపుల్లో అయితే ఇవేమి ఉండవు. డబ్బులతో పాటు సమయం ఆదా అవుతుంది.

ఇంటికే వచ్చి పరీక్షలు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరం..

ఏఎన్‌ఎంలు నేరుగా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయడం వల్ల ప్రధానంగా వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇక మెడికల్‌ క్యాంపులో అవసరమైన వారికి ఈసీజీ కూడా తీస్తున్నారు. అనంతరం స్పెషలిస్టు డాక్టర్లు రోగులకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. అనంతరం మందులు పంపిణీ చేస్తున్నారు. వీటి ఖర్చులు బయట చూస్తే.. దాదాపు మరో రూ.1500 అవుతాయి. ఇలా మొత్తం నలుగురు ఉన్న కుటుంబ సభ్యులు ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల సుమారు రూ.12వేల వరకు ఆదా అవుతోంది. దాదాపు కంటి పరీక్షలు, చిన్న పిల్లల విభాగం వల్ల ఒక్కో కుటుంబానికి అదనంగా మరో రూ.1000 నుంచి రూ.2,000 వరకు మిగులుతుంది.

రోగులు ఇబ్బంది పడకుండా మంచినీరు, ఇతర వసతులు..

ఇక క్యాంపునకు వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా వారికి మంచినీరు, కూర్చునేందుకు కుర్చీలు, ఇతర వసతులు కల్పించడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల హెల్ప్‌ డెస్కులను అందుబాటులో ఉంచారు. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఓ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్న భావన ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. నిరుపేద కుటుంబానికి ఉన్న అడ్డంకులను తొలగించి అందరినీ ఆరోగ్యంగా ఉంచేలా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పనిచేస్తోంది.