Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో ఐటీ సోదాలు.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్

  • IndiaGlitz, [Monday,December 12 2022]

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఇళ్లు , కార్యాలయాలపై రైడ్స్ జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్, దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు, విచారణ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక.. టాలీవుడ్ గత కొన్నిరోజులుగా ఈడీ, ఐటీ నిఘాలో వుంది. కొందరు రాజకీయ ప్రముఖులు అక్రమ మార్గాల్లో సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఐడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ సినిమా నిర్మాతలు ఛార్మీ, పూరీ జగన్నాథ్‌లతో పాటు హీరో విజయ్ దేవరకొండలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

మైత్రీ మూవీ మేకర్స్ చేతుల్లో భారీ బడ్జెట్ సినిమాలు:

తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. ఈ సంస్థ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేనీ, మోహన్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మైత్రీ సంస్థ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో వీర సింహారెడ్డి, చిరంజీవితో వాల్తేర్ వీరయ్య, అల్లు అర్జున్‌తో పుష్ప 2, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌ చిత్రాలను నిర్మిస్తోంది. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.

ఏకకాలంలో 15 చోట్ల సోదాలు:

ఇలాంటి పరిస్ధితుల్లో మైత్రిలో ఐటీ దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. గతంలోని, ప్రస్తుతం నిర్మించిన చిత్రాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.