గంట వ్యవధిలో భిన్నమైన స్టేట్‌మెంట్స్.. లాక్‌డౌన్ లేనట్టేనట..

  • IndiaGlitz, [Thursday,April 29 2021]

బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో తెలంగాణలో రెండు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అవేంటంటే 30 తరువాత ఏ క్షణమైనా లాక్‌డౌన్ విధించవచ్చనేది ఒకటి.. అదేమీ లేదు కరోనా త్వరలోనే అదుపులోకి వస్తుంది అసలు ఇప్పటికే కొంత మేర మెరుగైందని ఒకటి. మొదటిది తెలంగాణ హోం మంత్రి మహమూది అలీ లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సీఎం కేసీఆర్‌కు పంపారని.. దీనిపై సీఎం ఏ క్షణమైనా నిర్ణయం తీసుకోవచ్చంటూ ఓ న్యూస్‌ను అటు మీడియా.. ఇటు సోషల్ మీడియా ఓ రేంజ్‌లో వైరల్ చేసింది. కాసేపటికే ప్రజారోగ్య సంచాలకులు దీనికి భిన్నమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. లాక్‌డౌన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని తేల్చి చెప్పారు.

హోం మినిస్టర్ మహమూద్ అలీ.. బుధవారం డీజీపీ, మరో ముగ్గురు కమిషనర్లతో భేటి అయ్యారు. లకిడీకాపూల్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వానికి లాక్‌డౌన్‌పై రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. ఇప్పటికే హోంశాఖకు ప్రతిపాదనలు చేరారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేసుల సంఖ్య పెరిగితే లాక్‌డౌన్ విధించుకోవచ్చని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి సమీక్షకు ప్రాధాన్యత చోటు చేసుకుంది. అయితే ఈ సమీక్ష సమావేశంలో నిజానికి ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు కానీ 30 తరువాత లాక్‌డౌన్ పెట్టే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు మాత్రం మీడియాకు సమాచారం అందింది. దీనికి సోషల్ మీడియా కూడా తోడైంది. మొత్తానికి పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది.

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని ప్ర‌జారోగ్య సంచాల‌కులు, డాక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస‌రావు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అటువంటి ప్ర‌తిపాద‌న‌లేవీ ఇవ్వ‌లేదని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌లో స్థిర‌త్వం వ‌చ్చిందని, ప్ర‌జ‌లు ఇలాగే జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌రో 3-4 వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుందని చెప్పారు. కాబ‌ట్టి లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న లేదని చెప్పారు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్య ఆరోగ్యశాఖ‌కు లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి గంట వ్యవధిలో రెండు భిన్నమైన స్టేట్‌మెంట్లు రావడంతో జనం కన్ఫ్యూజన్‌కు గురయ్యారు.