భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా.. 6 వేలకు పైగా కొత్త కేసులు, ఏడాది తర్వాత ఇదే తొలిసారి

  • IndiaGlitz, [Friday,April 07 2023]

శాంతించింది అనుకున్న కరోనా వైరస్ భారత్‌లో మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జాగ్రత్త పడకుంటే మరోసారి దేశంలో శవాల కుప్పలు, నిర్విరామంగా మండే స్మశాన వాటికలు, ఆక్సిజన్ కోసం ఆక్రందనలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం కొత్తగా ఆరు వేలకు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 1,78,533 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా.. 6,050 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందని కేంద్రం తెలిపింది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు 13 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ 16 తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 5 వేల మార్క్‌ను దాటాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా :

మరోవైపు తాజా కేసులతో కలిపి రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతానికి చేరినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ప్రస్తుతం యాక్టీవ్ కేసుల విషయానికి వస్తే అవి 28,303కి చేరగా.. రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో ఈ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య 5,30,943కి చేరింది. కేరళ, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా ఉద్ధృతి ఎక్కువగా వుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

మాస్క్ తప్పనిసరి నిబంధనలు అమలు :

కాగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల మాస్క్ తప్పనిసరి ఆదేశాలు అమలవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. అలాగే దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.