Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

  • IndiaGlitz, [Monday,September 04 2023]

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు. కానీ తాను ఎక్కడా దొరకకుండా , దొరికినా ఏదో విధంగా తప్పించుకునేలా చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టు‌లు ఇచ్చి.. మళ్లీ సబ్ కాంట్రాక్ట్‌ల పేరుతో షెల్ కంపెనీలను సృష్టించి కోట్ల రూపాయలను చంద్రబాబు కమీషన్‌ల కింద వసూలు చేశారని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది.

రూ.8 వేల కోట్ల నిర్మాణ పనుల్లో భారీ అవినీతి :

నవ్యాంధ్రకు తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు అవినీతి బాగోతాల్ని ఐటీ శాఖ వెలికి తీసింది. తనకు, తన మనుషులకు కమీషన్ల రాకుంటే నిబంధనల పేరుతో కొరడా ఝళిపించేవారు. వీటి ధాటికి ఎంతటి పెద్ద కాంట్రాక్టర్ అయినా తన దారికి రావాల్సిందే. అలా 2014 నుంచి 2019 మధ్య కాలంలో షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ టూబ్రో సంస్థలు కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేశాయి.

మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లింపులు :

వీటిలో శాసనసభ, సెక్రటేరియట్‌ తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన రేటు చాలా ఎక్కువ. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌ ఏకంగా రూ.600 కోట్లకు పైగానే. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ. 10 వేలకు పైగా చెల్లించారు. ప్రస్తుతం దేశంలో నిర్మిస్తున్న లగ్జరీ అపార్ట్‌మెంట్లు కూడా ఈ స్థాయి ధర పలకడం లేదు, కానీ చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ రేటు చెల్లించారు. అలాగే పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 2200 చొప్పున ఇచ్చారు. వాస్తవానికి ఆ రోజుల్లో ఆ ఇంటి నిర్మాణంలో అడుగుకు రూ.1000కి మించి లేదు. అయినప్పటికీ చంద్రబాబు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ సంస్థలకు ఇలా అధిక ధరలకు పనులు ఇచ్చినందుకు చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్ ద్వారా రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. ఇందు కోసం మూడు బోగస్ కంపెనీలను సృష్టించి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టినట్లు ఉత్తుత్తి ఆధారాలు, నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించారు.

పార్టీ ఫండ్‌గా వద్దు.. నగదు రూపంలో కావాల్సిందే :

షాపూర్జీ పల్లోంజీ సంస్థకు చెందిన కన్సల్టెంట్ మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చెందిన సంస్థల్లో ఐటి అధికారులు జరిపిన దాడుల్లో దొరికిన ఓ చిన్న ఆధారాన్ని పట్టుకుని తీగ లాగితే డొంక కదిలింది. ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు అప్పగించినందుకు తమకు నేరుగా నగదు రూపంలో రూ.118 కోట్లు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు హుకుం జారీ చేశారట. దానిని పార్టీ ఫండ్ రూపంలో ఇస్తే కుదరదని చెప్పడంతో అయన చేసేది లేక చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ముడుపులు చెల్లించుకున్నారు.

ఐటీ అధికారులనే బుకాయించే యత్నం :

ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సెక్షన్ 127, 153C కింద ఐటీ శాఖ అధికారులు పలుమార్లు నోటీసులు జరీ చేసారు. దీనికి తెలుగుదేశం అధినేత వైపు నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. నోటీసులు ఇచ్చే విధానం ఇది కాదంటూ ఐటీ అధికారులనే చంద్రబాబు బుకాయించారు. దీనికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు అదే స్థాయిలో స్పందించారు. తమ విధానాలు, తమ అధికార పరిధిని వివరిస్తూ నోటీసుల్లో ఈ డబ్బు ఎలా వచ్చింది.. ఎవరిచ్చారు అంటూ ప్రశ్నలు సంధించారు. దీనిని ఆదాయానికి మించిన ఆస్తి కింద పరిగణించాలా లేదా అని ప్రశ్నించారు. అలా నాలుగు సార్లు అలా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాక చంద్రబాబు సైలెంట్ అయ్యారు.

ఇంకెంత దోచుకున్నారో :

ఇక్కడే సామాన్య ప్రజానీకానికి, మేధావులకు, రాజకీయ నాయకులకు కొత్త డౌట్లు వస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్యే ఈ స్థాయిలో అక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వున్నప్పుడు ఇంకెన్ని ఘనకార్యాలు వెలగబెట్టారోనని చర్చించుకుంటున్నారు. ఇప్పటికి దొరికింది గోరంతేనని , దొరకాల్సింది కొండంత ఏమోనంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.