Allu Arjun Theatre: అమీర్‌పేటలో అల్లు అర్జున్ థియేటర్ రెడీ... ఫోటోలు వైరల్

  • IndiaGlitz, [Friday,December 09 2022]

తమ ముందు తరాల వారిని చూశారో.. లేక వ్యక్తిగత అనుభవమో కానీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వైపు సినిమాల్లో వుంటూనే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. ఒకరిని చూసి మరొకరు జాగ్రత్త పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండలు ఈ లిస్ట్‌లో అందరికంటే ముందే వున్నారు.  

సత్యం పేరును కొనసాగిస్తూనే:

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. దీనిలో భాగంగా ఏషియన్ అల్లు పేరిట హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఓపెనింగ్‌కి ముస్తాబైంది. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ సినీ ప్రేక్షకులకు, ప్రజలకు సుపరిచితం. దీనిని కొనుగోలు చేసిన బన్నీ.. ఏషియన్ గ్రూప్‌తో కలిసి అత్యాధునిక హంగులతో ముస్తాబు చేస్తున్నారు. అలాగే సత్యం బ్రాండ్ వాల్యూ పోకుండా ఆ పేరునే కొనసాగిస్తూ ‘‘ఏషియన్ సత్యం’’తోనే మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్ :

మరోవైపు.. పుష్ప 2 షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్యాంకాక్‌లో రెండు వారాల పాటు చిత్రీకరణ జరిగే అవకాశం వుంది. అక్కడి అడవుల్లో రెండ్రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. స్నేహితుని పెళ్లి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన బన్నీ.. అక్కడి నుంచి నేరుగా బ్యాంకాక్‌లోని చిత్ర యూనిట్‌ను కలుస్తారట. తొలి పార్ట్ మాదిరే క్రిస్మస్ సీజన్‌లోనే పుష్ప ది రూల్‌ని రిలీజ్ చేస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.