IB Syllabus:ఐబీ సిలబస్ ఒప్పందం.. సీఎం జగన్ 'క్విడ్ ప్రోకో'కి సజీవ సాక్ష్యం..

  • IndiaGlitz, [Thursday,October 19 2023]

పేద విద్యార్థుల పేరుతో విద్యాశాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ తెరలేపారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. తన స్వలాభం కోసం విద్యా శాఖను అక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ- ఐబీ(ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం వైసీపీ ప్రభుత్వ అవినీతికి కేంద్ర బిందువు.. ఇది ముఖ్యమంత్రి క్విడ్ ప్రోకోకి సజీవ సాక్ష్యం అని విమర్శించారు.

ఐబీ సిలబస్‌ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం..

పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని ఆ తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అని మాయ మాటలు చెప్పిన సీఎం.. తాజాగా ఐబీ సిలబస్‌ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం అవుతున్నారని పేర్కొ్ననారు. ఈ ఐబీ కరికులమ్‌ ప్రపంచంలో కేవలం 4 వేల పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న విధానమన్నారు. దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ ఉందని.. అలాంటి సిలబస్‌ను రాష్ట్రంలోని 40వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. అన్ని పాఠశాల్లలో ఈ సిలబస్‌ను అమలు చేయడానికి ఎందుకంత తొందరపడుతున్నారో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.

హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి అపార నష్టం..

మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఈ సీఎం.. అసలు ఐబీ సిలబస్ వల్ల పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళిక వేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఐబీ సిలబస్ చదివి అద్భుతమైన విజ్ఞానం పొంది శాస్త్రవేత్తలు అయిన వాళ్లు లేదా గొప్పవాళ్లు అయిన వ్యక్తులెవరూ లేరన్నారు. అలాంటిది ఇప్పుడు హడావుడిగా రాష్ట్రంలోని 44,381 ప్రభుత్వ పాఠశాలలతోపాటు, 13,406 ప్రైవేటు పాఠశాలలు, 839 ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి అపార నష్టం జరుగుతోందని. భవిష్యత్తు తరాలకు తీరని ఉత్పాతం సృష్టిస్తున్నారని వాపోయారు.

ఒప్పందంలో రెండు బైండింగు క్లాజులు దారుణంగా ఉన్నాయి..

ఐబీ సిలబస్ అమలు కోసం ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందంలో రెండు బైండింగు క్లాజులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. సిలబస్‌కు సంబంధించిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను కేవలం ఐబీ సంస్థకు మాత్రమే ఇవ్వాలన్నారు. ఈ ట్రైనింగ్ కోసం రూ.1200 కోట్లు నుంచి రూ.1500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంత భారీగా ఓ ప్రైవేటు సంస్థకు ఒప్పందం ఎందుకు చేసుకుంటున్నారని నాదెండ్ల ప్రశ్నించారు.

ఓ వ్యక్తి మూర్ఖత్వానికి.. ఇంత మంది విద్యార్థులు బలి కావాలా..?

ఇక రెండో ప్రధాన బైండింగ్ క్లాజును పరిశీలిస్తే ఈ సంస్థ జెనీవా ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. అంటే స్విట్జర్లాండ్ చట్టాలు మాత్రమే సంస్థకు వర్తిస్తాయన్నారు. భవిష్యత్తులో సంస్థ విషయంలో ఏదైనా తప్పు జరిగినా దేశ చట్టాలు పనికి రావు అనేది ప్రధానమైన క్లాజు అన్నారు. అసలు మన దేశ చట్టాలే పనికిరాని ఓ ఒప్పందం వైసీపీ ప్రభుత్వం ఎవరి గురించి చేసుకుంటోందన్నారు. ఓ వ్యక్తి మూర్ఖత్వానికి.. ఇంత మంది విద్యార్థులు బలి కావాలా..? వ్యవస్థలు బలికావాలా..? నిధులు నిరూపయోగం కావాలా..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఐబీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోకూడదన్నారు.

క్రీయాశీలక కుటుంబాలకు బీమా చెక్కులు అందజేత..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులు అందించారు. మొత్తం ఐదు కుటుంబాలకు రూ.25లక్షల చెక్కులు అందించారు. అనంతరం రాజోలు నియోజకవర్గానికి పలువురు వైసీపీ నాయకులు నాదెండ్ల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.