KCR: నేను కూడా ప్రధాని రేసులో ఉంటా.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Saturday,May 11 2024]

తెలంగాణలో మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి 200 నుంచి 220 సీట్లు మాత్రమే వస్తాయని తనకు సమాచారం ఉందన్నారు. ఇక ఇండియా కూటమికి అస్సలు ఛాన్సే లేదని తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రాంతీయ పార్టీలు మహోన్నత శక్తులుగా అవతరించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓ ఆశ్చర్యం జ‌రగ‌బోతుందని.. ప్రాంతీయ పార్టీల‌న్నీ ఓ శ‌క్తిగా ఆవిర్భవించ‌నున్నాయ‌ని తెలిపారు. ప్రాంతీయ పార్టీల‌కే ఎన్డీఏ లేదా ఇండియా కూట‌మి స‌పోర్టు ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ంటూ చెప్పుకొచ్చారు. బీజేపీకి వచ్చే 220 సీట్లలో దక్షిణాదిలో కేవలం10 ఎంపీ సీట్లు వస్తాయంటూ పేర్కొన్నారు. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్కసీటు కూడా రాదన్నారు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ 12 నుంచి 14 ఎంపీ సీట్లను గెలిచే అవకాశం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 9 నియోజకవర్గాల్లో 3 స్థానంలో ఉంటుందని.. బీజేపీకి ఒకటి లేదా జీరో సీట్లు వస్తాయని చెప్పారు. అవరసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారితే.. గత ప్రభుత్వం కంటే బాగా పనిచేయాలి కానీ అనేక ముఖ్య విషయాలు పక్కన పెట్టి చిల్లర రాజకీయాలు చేశారంటూ కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలంటూ ప్రతిపక్షాలను తూలనాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న జోష్‌.. కాంగ్రెస్‌లో ఇప్పుడు లేదన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.. అదే కాంగ్రెస్‌ను ముంచెయ్యబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నింట్లో విఫలమైందని కరెంట్ కోతలకు తెలంగాణను నిలయంగా చేసిందన్నారు.

ఎమ్మెల్సీ క‌విత అరెస్టు గురించి స్పందిస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాం అనే ప్రధాని మోదీ సృష్టించిన రివర్స్ రాజకీయ కుంభకోణమని చెప్పుకొచ్చారు. ఇప్పటి వ‌ర‌కు ఈ కేసులో ఒక్క రూపాయి కూడా రిక‌వ‌రీ చేయ‌లేద‌ని తెలిపారు. మోదీకి తనపై, కేజ్రీవాల్‌పై కుట్ర ఉందని.. అందుకే ఈ కుట్రకు తెరలేపారన్నారు. కవిత ఎలాంటిదో అందరికీ తెలుసని.. జైలు తమకు కొత్తకాదన్నారు. త్వరలోనే కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.