నిత్యానంద ఆశ్రమంలో బాలికలకు టార్చర్... వీడియోలు చేయాలంటూ హింసించిన వైనం

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. మైనర్ బాలికలను అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని వార్తలు రావడంతో ఈ నకిలీ బాబా దేశం నుంచి పారిపోయినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత మైనర్ బాలికలు మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన జనార్ధన్ శర్మ తన కూతుళ్లను నిత్యానంద గురుకలంలో చేర్చారు. అప్పటి నుంచి లక్షలు, కోట్లలో ఆశ్రమానికి ఫండ్ ఇవ్వాలని వేధించే వారని... ఇందుకోసం ఎకరాలకు ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు.

అయితే తన పిల్లలను పంపించాలని కోరితే నిర్వాహకులు తిరస్కరించారని... పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... పలువురు మైనర్ బాలికలకు విముక్తి కలిగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిన్నారులు నిత్యానంద తమను వేధించేవారని వాపోయారు. రాత్రి నిద్రలేపి మేకప్, జ్యువెల్లరీ వేసుకుని వీడియో చేయాలని వేధించేవారని తెలిపారు. నిత్యానందం సమక్షంలోనే ఇదంతా జరిగేదని చెప్పుకొచ్చారు పిల్లలు. తిరస్కరిస్తే గదిలో బంధించే వారని తెలిపారు.

కాగా, ఈ కేసులో ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... నకిలీ బాబా నిత్యానంద కోసం గాలిస్తున్నారు. అయితే ఈ వివాదాస్పద గురువు దేశం నుంచి పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.