Barrelakka:బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

  • IndiaGlitz, [Friday,November 24 2023]

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ శిరీషకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఆమె వెంట ఓ గన్‌మెన్‌ కేటాయించాలని ఆదేశించింది. అలాగే ప్రచారంలో శిరీష్ నిర్వహించే పబ్లిక్‌ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్‌తో పాటు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పించడం సరికాదని.. ముప్పు ఉన్న ప్రతి అభ్యర్థికి సెక్యురిటీ ఇవ్వాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని స్పష్టం చేసింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తామంటే కుదరదని చురకలు అంటించింది.

మూడు రోజుల క్రితం బర్రెలక్క ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు ఆమె తమ్ముడిపై దాడి చేయడం కలకలం రేపింది. దీంతో తనను ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో శిరీషకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు మద్దతు పలుకుతున్నారు. దాడి నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తనకు 2ప్లస్2 గన్‌మెన్లను కేటాయించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒక గన్‌మెన్‌ను కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఇక కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు బరిలో ఉన్నారు. ఇలాంటి సీనియర్ నాయకుల మధ్య బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.