Naga Chaitanya :సిక్కోలు జిల్లాలో మారుమూల గ్రామానికి నాగచైతన్య .. మత్స్యకారులతో ముచ్చట్లు, ఏం జరుగుతోంది..?

  • IndiaGlitz, [Thursday,August 03 2023]

అక్కినేని నాగచైతన్య.. ఏఎన్ఆర్ వంశం నుంచి తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన మూడో తరం హీరో. తండ్రి, తాతల నుంచి నట వారసత్వం పుణికిపుచ్చుకున్న చైతూ వారిద్దరి బాటలోనే లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కలిసొచ్చిన జోనర్స్‌లో సినిమాలు చేస్తూ.. మాస్ ఇమేజ్ కోసం కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కస్టడీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో ఈసారి సాలీడ్ హిట్ కొట్టాలని చైతన్య కష్టపడుతున్నాడు. ప్రస్తుతం యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

చందు మొండేటి దర్శకత్వంలో చైతూ :

శ్రీకాకుళం జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ స్టోరీ కోసం దర్శకుడు చందు మొండేటి, నాగచైతన్య , బన్నీ వాసులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, మత్స్యకారులతో మాట్లాడి, వారి రోజువారీ జీవితాన్ని పరిశీలించారు. అంతేకాదు.. మత్స్యకారులతో కలిసి నాగచైతన్య సముద్రంలో వేటకు కూడా వెళ్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నాగచైతన్యను చూసేందుకు ఎగబడ్డ జనం :

కాగా.. హీరో నాగచైతన్య తమ గ్రామానికి వస్తున్నారని తెలుసుకున్న డి.మత్స్యలేశం గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అంతేకాదు.. నాగచైతన్యను చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అనంతరం నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ.. కొద్దినెలల క్రితం చందూ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందన్నారు. మత్స్యకారుల జీవన విధానం ఇతివృత్తంతో ఈ కథ వుందని చైతూ తెలిపారు. అందుకే వారి గురించి తెలుసుకునేందుకు మత్స్యలేశం గ్రామానికి వచ్చామని చైతన్య చెప్పారు.

ఆ రామారావు జీవితగాథలో చైతూ :

ఇకపోతే.. 2018 ప్రాంతంలో గుజరాత్ తీరంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌లకు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారంగా చందూ మొండేటి ఈ కథ రాసుకున్నట్లుగా సమాచారం. మత్స్యకారుల వలసలు, పాకిస్తాన్ తీర రక్షక దళానికి చిక్కడం, అక్కడ కష్టాలు, భారతదేశంలో తిరిగి అడుగుపెట్టడం వంటి ఇతివృత్తంతో ఈ సినిమాను రెడీ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్.