Kodali Nani:పకోడిగాళ్లంతా చెప్పేవాళ్లే.. డ్యాన్సులు, ఫైట్లు చూసుకోవాలి.. రాజకీయాలెందుకు : చిరంజీవికి కొడాలి నాని కౌంటర్

  • IndiaGlitz, [Tuesday,August 08 2023]

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీటికి వైసీపీ నేతలు, మంత్రులు అంతే ఘాటుగా బదులిస్తున్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు వున్నారని.. ప్రభుత్వం ఎలా వుండాలో ఆ పకోడిగాళ్లు కూడా సలహాలిస్తున్నారంటూ నాని సెటైర్లు వేశారు. అలాంటి వాళ్లు తమ వాళ్లకు కూడా రాజకీయాలు మనకెందుకురా బాబూ.. డ్యాన్సులు, ఫైట్లు చూసుకుందామని సలహాలిస్తే బాగుంటుందని పరోక్షంగా పవన్‌కు కూడా చురకలంటించారు నాని.

చిరంజీవి ఏమన్నారంటే :

బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలని, ప్రత్యేక హోదా, లేదంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి కానీ.. లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, పేదవాళ్ల ఆకలి తీర్చే పథకాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడితే అంతా సంతోషిస్తారని చిరంజీవి పేర్కొన్నారు. కానీ అవన్నీ వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా.. ఇలాంటి పనులు మానుకోవాలని మెగాస్టార్ పేర్కొన్నారు.

200 రోజుల షీల్డ్ అందుకోవడం ఆనందంగా వుంది:

ఇంకా చిరంజీవి ఏమన్నారంటే.. ఆ రోజుల్లో సినిమాలు 100 రోజులు, 200 వందల రోజులు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఆడేవన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయని.. కానీ ఇప్పుడు రెండు వారాల్లోనే సినిమా జర్నీ ముగుస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడటం సాధారణ విషయం కాదని, అప్పటి మాదిరిగా షీల్డ్స్ తీసుకోవడం ఆనందంగా వుందని చిరు అన్నారు. పాత రోజులు రిపీట్ అవుతాయా అనే అనుమానాలు, సందేహలు వుండేవని, కానీ అంతా కష్టపడి ఇది సాధ్యమేనని నిరూపించారని మెగాస్టార్ ప్రశంసించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, చెర్రీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.