నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్.. వారసుడు వచ్చేస్తున్నాడు...

  • IndiaGlitz, [Wednesday,January 24 2024]

దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుటుంబాల నుంచి కొంతమంది వారసులు కూడా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు. కానీ నందమూరి మూడో తరం వారసుడి కోసం మాత్రం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ. కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అవి నిజం కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. తాజాగా మోక్షు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని టాక్ ఊపందుకుంది. నటన, డ్యాన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటున్నాడని చెబుతన్నారు.

ఇటీవల మోక్షజ్ఞ బొద్దుగా, పొట్టతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్య వారసుడిగా సినిమాల్లోకి వస్తాడా..? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వాస్తవంగా తొలి నుంచి మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావాలని ఆసక్తి లేదట. అందుకే ఫిజిక్‌పై అంత ఫోకస్ చేసేవాడు కాదని సన్నిహితులు చెప్పేవారు. కానీ బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలని డిసైడ్ అయిన మోక్షు.. ముందు ఫిజిక్‌ మీద దృష్టి పెట్టాడట. అందుకే గతంలో కూడా ఇప్పుడు ఫిట్‌గా తయారయ్యాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాలయ్య కొడుకు వస్తున్నాడంటూ అభిమానులు పోస్టులు పెట్టారు.

తాజాగా నాన్నకు తగ్గ కొడుకు అనిపించుకోవాలని యాక్టింగ్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోలతో పాటు ప్రభాస్, ఎంతో మంది స్టార్ హీరోలకు శిక్షణ ఇచ్చిన వైజాగ్ సత్యనంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. గత నవంబర్ నుంచే శిక్షణలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తన ఫిజిక్‌పై మరింద దృష్టి పెట్టి స్లిమ్ లుక్‌లో కనపడేందుకు కసరత్తులు చేస్తున్నాడట. ఎంతో మంది స్టార్ హీరోలకు నటనలో మెళుకువలు నేర్పించిన సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారనే విషయం తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లయితే పెద్ద స్టార్ హీరో అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించారు. 'ఆదిత్య 369' సీక్వెల్‌తో మోక్షు అరంగేట్రం ఉంటుందని తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో డెబ్యూ ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం ఎంట్రీకి మోక్షజ్ఞ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎవరు లాంఛ్ చేస్తారనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో బోయపాటి తీయనున్న 'అఖండ-2' చిత్రం ద్వారా మోక్షు డెబ్యూ ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఓ పవర్ ఫుల్ పాత్ర రెడీ చేసినట్లు టాక్. మరి ఇంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ఏది ఏమైనా ఈ ఏడాది మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని సన్నిహితులు పేర్కొంటున్నారు.