AP Womens:ఏపీలో మహిళలకు శుభవార్త.. ఖాతాల్లో డబ్బులు జమ..

  • IndiaGlitz, [Tuesday,May 21 2024]

ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందించింది. మహిళలు, రైతులకు వరుసగా పథకాల డబ్బులు విడుదల చేస్తోంది. తాజాగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం, వైఎస్సార్ చేయూత, ఆసరా నిధుల్ని వారి అకౌంట్లలో జమ చేసింది. అగ్రవర్ణాలలోని పేద మహిళలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తోంది. మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా డబ్బులు విడుదల కాలేదు. అయితే పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని భావించినా ఎన్నికల సంఘం అనుమతించలేదు.

అయితే ఇప్పుడు పోలింగ్ ముగియడంతో మహిళల అకౌంట్‌లలో రూ.15వేల చొప్పున జమ చేశారు. మరోవైపు వైఎస్సార్‌ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వరకు అర్హులైనవారికి ఏడాదికి రూ.18,750 అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించి కూడా తాజాగా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.18,750 జమ చేసింది ప్రభుత్వం. అలాగే వైఎస్సార్ ఆసరా కింద ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లను ఖాతాలలో జమ చేసింది. ఇక రైతులకు సైతం రూ.1,236 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేసింది. ఒకవేళ డబ్బులు జమ కాని పక్షంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి 2024 ఏడాదికి గాను సీఎం జగన్ బటన్ నొక్కారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లో జమకాలేదు. మే 13న పోలింగ్‌కు ముందు ఈ డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేయగా అనుమతి రాలేదు. దీంతో పలువురు లబ్ధిదారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.. డబ్బులు జమ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి మే 10వ తేదీ ఒక్కరోజు నిధులను విడుదల చేసుకోవచ్చని తీర్పును వెల్లడించారు.

అయితే ఈసీ దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎప్పుడో నొక్కిన బటన్‌లకు ఇన్ని రోజుల నుంచి డబ్బులు చెల్లించకుండా.. పోలింగ్‌కు రెండు రోజులు ముందు ఇవ్వడానికి కారణాలు చెప్పాలని ఆదేశించింది. అసలు ఇప్పటికప్పుడు అంత డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఘాటు లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుంచి ఈసీకి సరైన సమాధానం వెళ్లలేదు. దీంతో పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి నిధులు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం నిధుల విడుదల చేపట్టింది.