బ్యాంక్‌లో లోన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్...

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నవారికి ఆర్బీఐ శుభవార్త అందించింది. ముందుగా అనుకున్నట్లుగానే ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం అన్నీ శుభవార్తలే చెబుతూ పక్కా స్కెచ్‌తోనే ముందుకెళ్తోంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటనలో భాగంగా రెపోరేటును 6.25 నుంచి 6%కు తగ్గించింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో గృహరుణాలతో సహా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

ఇదిలా ఉంటే రెపోరేటు తగ్గింపు మినహా మిగిలినవన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. మూడు రోజుల పాటు దేశ ఆర్థిక, బ్యాంకింగ్‌ పరిస్థితులను మదింపు చేసిన ఎంపీసీ కమిటీ కొద్దిసేపటి క్రితం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా గతంలో కూడా ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4% నుంచి 7.2%గా ఉండవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఇటు లోన్స్ తీసుకున్న వారికి.. గృహరుణాలు తీసుకోవాలనుకున్న వారికి ఆర్బీఐ శుభవార్త చెప్పడంతో పలువురు ఆనందంలో మునిగితేలుతున్నారు.