Hanuman:ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. 'హనుమాన్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడే..?

  • IndiaGlitz, [Saturday,February 17 2024]

సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైంది. పెద్ద సినిమాల ధాటికి థియేటర్లు కూడా దక్కలేదు. అయినా కానీ అంచనాలను తారుమారు చేస్తూ బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి థియేటర్లు దక్కించుకుంది. ఆ సినిమానే 'హనుమాన్'. ఇక్కడే కాదు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది. జ‌న‌వ‌రి 12న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ థియేట‌ర్లలో ఆడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో నెల రోజులు దాటినా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించిన సినిమా ఇదే కావడం విశేషం. అంతలా అభిమానులు ఆకట్టుకుంది. దీంతో రూ.300కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

మరోవైపు థియేటర్లలో చూసిన వారు ఓటీటీలోనూ చూసేందుకు సిద్ధమయ్యారు. అయితే సంక్రాంతికి విడుదలైన సినిమాలన్ని ఇప్పటికే ఓటీటీలో విడుదలవ్వగా.. హనుమాన్ చిత్రం మాత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. అందుకే ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడూ ఓటీటీలోకి వస్తుందని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి అదిరిపోయే న్యూస్ ఇది. 'హ‌నుమాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింద‌నే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. విడుదలైన 50 రోజుల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ఒప్పందం జ‌రిగిన‌ట్లుగా టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం మార్చి 2న ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై జీ5 నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇదే రోజున రావడం మాత్రం ఖాయమని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే హిందీ డబ్బింగ్ సినిమాల్లో రూ.50 కోట్లు సాధించిన సినిమాల జాబితాలోకి కూడా చేరిపోయింది. ఇప్పటివరకు 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'పుష్ప', 'RRR', 'రోబో 2', 'కాంతార', 'KGF 2' సినిమాలు మాత్రమే ఈ రికార్డుని సాధించాయి. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిశోర్‌, సముద్రఖని, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇచ్చిన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే ‘జై హనుమాన్‌’ను తెరకెక్కించనున్నారు.