Chandrababu:తనపై నమోదుచేసిన కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

  • IndiaGlitz, [Tuesday,March 05 2024]

మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. గత ఐదేళ్ల కాలంలో ప్రజాసమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీసు స్టేషన్లలో, వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో నాకు సమాచారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నానుఅని పేర్కొన్నారు.

నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఏ క్షణలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను. వ్యక్తి గతంగా నేను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి మీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను అని ముగించారు. ఈ లేఖను డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సిఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు పంపించారు.

కాగా చంద్రబాబుపై నమోదుచేసిన కొన్ని అక్రమ కేసులతో ప్రభుత్వం ఎన్నికల సమయంలో కుట్రలకు పాల్పడే అనుమానం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే నామినేషన్ల సమయంలో కేసుల గురించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా లేఖ రాశారని తెలిపారు. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. పుంగనూరు అంగళ్లు ఘర్షణ నేపథ్యంలో ఓ కేసు, అమరావతి ఉద్యమం సమయంలో మరో కేసు, వీటితో పాటు స్కిల్ డెవల్‌పెమెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, ఫైబర్ నెట్, మద్యం కుంభకోణాలో ఆయన హస్తం ఉన్నట్లు సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.