Garikapati Narasimha Rao: ‘‘చిరంజీవి గారు .. మీ ఫోటో సెషన్ ఆపుతారా, వెళ్లిపోమంటారా ’’ : స్టేజ్‌పైనే గరికపాటి అసహనం

  • IndiaGlitz, [Thursday,October 06 2022]

అవధానులంటే అర్ధం కానీ గ్రంథికాలతో ప్రవచనాలు చెబుతారనే అపోహని తొలగించి.. తేట తెలుగులో అందరికీ అర్ధమయ్యే రీతిలో ఆబాలా గోపాలానికి చేరువయ్యారు ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు. పెద్దల కంటే ఎక్కువగా యువత ఆయన ప్రవచనాలంటే పడిచచ్చిపోతారు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో గరికపాటి తరచుగా వార్తల్లోకెక్కుతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పట్ల వ్యవహరించిన తీరుతో గరికపాటిని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే:

విజయదశమిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ఎప్పటిలాగే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి నరసింహారావు ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. అయితే చిరంజీవిని చూడగానే అక్కడున్న వారంతా ఆయనను చుట్టిముట్టేశారు. సెల్‌ఫోన్‌లు తీసి చిత్రీకరించడంతో పాటు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. సరిగ్గా అప్పుడే గరికపాటి ప్రసంగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి చుట్టూ వున్న జనం కేకలు, ఈలలు వేస్తూ గోల చేయడంతో నరసింహారావులో సహనం నశించింది. అంతే వేదిక మీద నుంచే ‘‘చిరంజీవిగారు.. మీ ఫోటో సెషన్ ఆపితే.. నేను ప్రసంగం మొదలెడతా’’ నంటూ తీవ్ర స్వరంతో గద్దించారు.

గరికపాటికి చిరంజీవి క్షమాపణలు:

గరికపాటి కామెంట్స్‌తో వెంటనే స్పందించిన చిరంజీవి జనానికి సర్దిచెప్పి ఆ గుంపు నుంచి బయటకు వచ్చేశారు. నరసింహారావుకు క్షమాపణలు చెప్పడంతో పాటు తన ఇంటికి ఓ రోజున భోజనానికి రావాల్సిందిగా కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్.. గరికపాటిపై విరుచుకుపడుతున్నారు. మీమ్స్ , కామెంట్స్‌తో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.