Kumaraswamy: తప్పు చేయకపోతే భారత్‌కు తిరిగి వచ్చేయ్.. ప్రజ్వల్‌కు కుమారస్వామి విజ్ఞప్తి

  • IndiaGlitz, [Tuesday,May 21 2024]

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక సూచన చేశారు. తనపై, దేవెగౌడపై ఏమాత్రం గౌరవం ఉన్నా 48 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చి సిట్‌ ఎదుట లొంగిపోవాలని కోరారు. ఏ తప్పూ చేయనట్టయితే భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈమేరకు కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు తమ కుటుంబ పరువు మర్యాదలకు మచ్చగా మారాయని వాపోయారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే వెంటనే భారత్‌కు తిరిగొచ్చి పోలీసుల విచారణకు సహకరించాలని కోరారు. కుటుంబ పరువు మర్యాదలను కాపాడాలని సూచించారు. సోదరుడు రేవణ్ణ కుటుంబం గురించి, ఆ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారాల గురించి తనకు పెద్దగా తెలియదని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నేపథ్యంలో తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా తామంతా అడ్డుకున్నామని కుమారస్వామి వెల్లడించారు.

కాగా కర్ణాటకను కుదిపేసిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని వారిపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు ఎన్నికలకు ముందు పలువురు మహిళలతో ప్రజ్వల్ సన్నిహితంగా ఉన్న వీడియోల పెన్ డ్రైవ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో పలువురు మహిళలతో ప్రజ్వల్ సన్నిహితంగా ఉన్న దాదాపు 3వేల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నాలుగు రోజులకు తన డిప్లమాటిక్ పాస్ పోర్ట్ సాయంతో జర్మనీ వెళ్లిపోయాడు. దీంతో దేవెగౌడ కుటుంబంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. మరోవైపు జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీపైనా విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఇండియాకు తిరిగొచ్చి విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్‌కు కుమారస్వామి సూచించారు. మరోవైపు ప్రజ్వల్‌పై ఇప్పటికే అత్యాచారం కేసు నమోదుచేశారు. అలాగే విదేశాల్లోని పోలీసులు పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు.