Bathini Harinath Goud:విషాదం : చేప మందు ప్రసాదం దాత బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • IndiaGlitz, [Thursday,August 24 2023]

ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత చేకూర్చేందుకు గాను చేపమందుతో ప్రసాదంతో తెలుగువారికి సుపరిచితులైన బత్తిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. బత్తిన సోదరుల్లో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం బుధవారం రాత్రి విషమించడంతో హరినాథ్ గౌడ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు ప్రముఖులు హరినాథ్ గౌడ్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు.

176 ఏళ్లుగా చేపమందు పంపిణీ చేస్తోన్న బత్తిని కుటుంబం:

కాగా.. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఉబ్బసం రోగులకు చేపమందు పంపిణీ చేస్తున్నారు బత్తిని సోదరులు. గత 176 ఏళ్లుగా వీరి కుటుంబం చేప మందు ఇస్తూ ప్రజలకు సేవ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు సమీప రాష్ట్రాలకు చెందిన వారు కూడా చేపమందు తీసుకోవడానికి తరలివస్తారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ వస్తోంది . తొలుత పాతబస్తీలోనే చేపమందు పంపిణీ చేసేవారు. అయితే భద్రతా కారణాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చారు. శాకాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చేపమందును తీసుకుంటున్నారు. భోజనం చేసిన మూడు గంటల తర్వాత ముందు తీసుకోవాలి. గర్భిణిలకు మాత్రం ఇవ్వరు.