Revanth Reddy:సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం దీని మీదే..

  • IndiaGlitz, [Thursday,December 07 2023]

తెలంగాణ రెండో సీఎంగా కాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం హోదాలో తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ప్రజలు కూడా ఈ హామీల పట్ల సుముఖత వ్యక్తం చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఈ గ్యారంటీలు ఎంతో దోహదం చేశాయి.

ఆరు గ్యారంటీలు ఇవే..

మహాలక్ష్మి: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించింది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లింది.

రైతు భరోసా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000.. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామని పేర్కొంది. వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చింది.

గృహజ్యోతి : గృహజ్యోతి పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చింది.

ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి రూ.5లక్షలు ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు వారి కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని గ్యారంటీ ఇచ్చింది.

యువ వికాసం: విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది.

చేయూత: చేయూత పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌లను రూ.4వేలకు పెంచబోతున్నట్టు తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా ను కూడా 10 లక్షలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

మొత్తానికి ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డి ప్రజల సాక్షిగా ఈ ఆరు గ్యారంటీలపై సంతకం చేయనున్నారు.