ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నెదర్లాండ్స్ వేదికగా ప్రశంసలు..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెదర్లాండ్స్‌లోని యుట్రెచ్ట్‌లో జరుగుతున్న 'గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023లో భారత ప్రతినిధిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో భారత్ సహా ఈజిప్ట్, బుర్కినాఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్‌ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ ప్రతినిధి సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విద్యారంగంలో 'ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది' అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఏపీలో ఉన్న అద్భుతమైన SERT, జిల్లా విద్యాశాఖాధికారులు, DSOలతో పాటు అటౌన్ ఇంటర్నేష నల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ వంటి భాగస్వామ్య సంస్థల సహకారంతో సాధ్యమైంది అని తెలిపారు. అనంతరం అయన యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షియల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు.

ఇదే తొలిసారి కాదు..

రాష్ట్రంలో విద్యావ్యవస్థలో మొదలైన సంస్కరణలు, అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్‌లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయాదేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనావిధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాల మీద విద్యావేత్తలు, ఆర్థిక, సామాజికవేత్తలతో భేటీలు నిర్వహించారు.

విద్యావ్యవస్థ బలోపేతంపై వివరణ..

కొలంబియా , స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం పదిమంది విద్యార్థులు సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాలమీద అవగాహన పెంపొందించుకున్నారు. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ అక్కడి ప్రతినిధులకు విద్యార్థులు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వం విద్యకోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు.