Rayapati Sambasivarao:బయటపడ్డ రాయపాటి అక్రమాల చిట్టా.. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం, ఇండియాలోనే పెద్ద లోన్ స్కామ్ అట

  • IndiaGlitz, [Thursday,August 03 2023]

టీడీపీ నేతలు తెల్లారి లేస్తే.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తారన్నది తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్లు పోగేశారని, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ వుంటారు. ఇదంతా కాంగ్రెస్, టీడీపీ పెద్దల కుట్ర అని అందరికీ తెలిసిందే. అంతులేని ప్రజాదరణతో దూసుకెళ్తున్న జగన్ ఎక్కడ తమకు పోటీ వస్తాడేమోనన్న అక్కసుతో అక్రమ కేసుల్లో ఇరికించారని జనానికి తెలుసు. అయితే గురివింద గింజ మాదిరిగా ప్రవర్తించే టీడీపీ నేతలకు మాత్రం కొదవలేదు. బ్యాంక్‌లకు పంగనామం పెట్టి ఆ డబ్బును అక్రమ మార్గాల్లో తరలించిన తెలుగుదేశం నేతల కథలు ఒక్కొక్కటిగా బయటపడుతూ వున్నాయి. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, జేసీ బ్రదర్స్ తదితరులు అక్రమ వ్యాపారాలు, మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోకి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా చేరారు. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద రుణ సంబంధిత స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది.

రాయపాటి బాకీ.. అసలు, వడ్డీ కలిపి రూ.30 వేల కోట్లపైనే:

రాయపాటి సాంబశివరావు 13 బ్యాంకులలో రూ.9,394 కోట్ల రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు తరలించారు. అనంతరం తన యాజమాన్యంలోని ట్రాన్స‌ట్రాయ్ కంపెనీ ఖాతాలకు సింగపూర్ నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. 2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. తాజాగా మంగళవారం మనీలాండరింగ్ కేసులో భాగంగా మరోసారి రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాదు.. అప్పట్లో ఆయన తీసుకున్న రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు ముప్పయి వేల కోట్లకు చేరినట్లు బ్యాంకులు చెబుతున్నాయి.

వాళ్లు చంద్రబాబు సూచనతోనే బీజేపీలో చేరారా..? :

2019లో మోడీకి ఎదురుతిరిగి చంద్రబాబు బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను కేంద్ర సంస్థలు టార్గెట్ చేశాయి. దీంతో వీరిద్దరితో పాటు టీడీపీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు, కేసుల నుంచి తప్పించుకునేందుకు వీరు చంద్రబాబు సూచనల మేరకు భారతీయ జనతా పార్టీలో చేరినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. వీరి సాయంతో ఢిల్లీలోనూ, బీజేపీలోనూ చక్రం తిప్పాలని చంద్రబాబు చూశారు. ఇప్పుడు కేంద్ర సంస్థల రాడార్‌లోకి రాయపాటి సాంబశివరావు కూడా చేరడంతో ఆయనను కూడా కాషాయ తీర్ధం తీసుకుని టీడీపీ అధినేత ప్రోత్సహిస్తారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పార్టీ రుణం సరే.. మరి బ్యాంకుల రుణ:

ఈ సంగతి పక్కనబెడితే.. కలుగులోంచి ఒక్కొక్క ఎలుక బయటకు వస్తున్నట్లుగా సీఎం రమేష్, సుజనా చౌదరి ఇప్పుడు రాయపాటి సాంబశివరావు బాగోతం వెలుగుచూడగా.. ఇంకెంతమంది టీటీపీ నాయకులు దొరుకుతారోనంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే వీరంతా చంద్రబాబు నాయుడు అండ చూసుకునే ఇలా అక్రమ మార్గాల ద్వారా వేల కోట్లు పోగేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బ్యాంక్‌లనో , మరేదైనా సంస్థనో బురిడీ కొట్టించి తెచ్చిన డబ్బును మళ్ళీ పార్టీ కోసం..ఎన్నికలకోసం ఖర్చు చేసి తమ రుణం తీర్చుకుంటారు. పార్టీ రుణమైతే తీరుస్తారు కానీ బ్యాంకులకు కట్టాల్సిన రుణం మాత్రం వీరు తీర్చరు గాక తీర్చరు. ఈ పరిణామాలు చూస్తే.. ఈ బ్యాచ్ మొత్తం ఇదే వృత్తి , ప్రవృత్తిగా రాజకీయాల్లో కొనసాగుతోందా అనే సందేహాలు కలగకమానవు.