టిక్కెట్ల విషయంలో ఇబ్బంది నిజమే.. కానీ కోర్టుకెక్కడం లేదు, జగన్‌తోనే తేల్చుకుంటాం: ఆర్ఆర్ఆర్ మేకర్స్

  • IndiaGlitz, [Sunday,November 14 2021]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల టాలీవుడ్ ఇబ్బందులు పడుతున్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్ల ధరల తగ్గింపే ఇందుకు కారణం. దీనిపై ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి సీఎం జగన్, మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు కూడా.

అయితే డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో టికెట్ల వ్యవహారం నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా ఈ గుబులు పట్టుకుంది. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ విషయమై కోర్టుకు వెళ్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ స్పందించారు. ‘‘ టిక్కెట్టు ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిజం. మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. తాము నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటామని’’ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ప్రస్తుతం సాధారణ థియేటర్లలో 100 రూపాయల వరకు ఉన్న టికెట్‌ ధర,… మల్టీప్లెక్స్‌లలో 250 వరకు ఉంది. కానీ ట్రిపులార్ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం వారం రోజుల పాటు టికెట్‌ ధర 500 రూపాయల ఉండాలని ట్రేడ్ వర్గాల అంచనా. మరి ఆ స్థాయిలో రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా…? ఈ విషయంలో సస్పెన్స్‌కు తెరపడాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తుండగా.. ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.